చిక్కడపల్లి, నవంబర్ 8: రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు రానుండటంతో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. ‘మోదీ గోబ్యాక్’ పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు టీఆర్ఎస్ కేవీ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ నేతలు మంగళవారం విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదని, సింగరేణికి చెందిన 4 బొగ్గు బావులను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నదని టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్ మండిపడ్డారు. సింగరేణి, ఎన్టీపీసీ లాంటి దిగ్గజ సంస్థల ప్రైవేటీకరణతోపాటు కొత్తగా తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం తలపెట్టిన ఈ నిరసనలో రాష్ట్రంలోని ఉద్యోగులు, కార్మికులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రయోజనాలకు, శ్రామిక వర్గాల హక్కులను హరించివేయడాన్ని నిరసిస్తూ ఉద్ధృత పోరాటాలు, సమ్మెలు నిర్వహించినా మోదీ సర్కారు లెక్కచేయడం లేదని ధ్వజమెత్తారు. విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను అడ్డగోలుగా ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న మోదీ సర్కారు.. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో పలు కార్మిక చట్టాలను రద్దుచేసి శ్రామికవర్గ హక్కులను హరించేందుకు బరితెగించిందని నిప్పులు చెరిగారు. సమావేశంలో ఏఐటీయూసీ రా్రష్ట్ర నాయకులు వీఎస్ బోస్, ఎస్ బాల్రాజ్, వీ సీతారాములు, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి పీ నారాయణ, సీఐటీయూ నాయకులు భూపాల్, జే వెంకటేశ్, ఎం వెంకటేశ్, ఐఎన్టీయసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీ విజయ్కుమార్ యాదవ్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామరావు తదితరులు పాల్గొన్నారు.
మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాం
విభజన హామీలను నెరవేర్చకుండా, తాను మాట్లాడిన ప్రతిసారీ.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణను అవమానిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ ప్రారంభమై విపరీతమైన దుర్వాసనను వెదజల్లుతున్నది. రామగుండం ప్రాంత భూ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయకుండా పరిశ్రమను ప్రైవేటుకు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అక్కడి పారిశ్రామిక ప్రాంత ప్రజలంగా వ్యతిరేకిస్తున్నారు. మోదీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక ధోరణిని తెలంగాణ వికాస సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కృష్ణాజలాల పంపిణీని ఇప్పటికీ తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొంటున్న మోదీ.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని మోదీ.. మా రైతుల వడ్లు కొనండి అంటే.. నూకలు తినండి అని అవమానించిన మోదీ రాకను వికాసిస్తున్నాం
-మల్లావఝల విజయానంద్, ఉపాధ్యక్షుడు, తెలంగాణ వికాస సమితి
పశువులకు లెక్కలు.. బీసీలకు ఉండవా?
దేశంలో పశువులు, జంతువుల లెక్కలు ఉన్నా, జనాభాలో 56 శాతం ఉన్న బీసీల లెక్కలు లేకపోవడం విచారకరం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఎందుకు ఏర్పాటుచేయరు? సుమారు రూ.38 లక్షల కోట్ల దేశ బడ్జెట్లో, 70 కోట్లున్న బీసీ జనాభాకు కేటాయింపులు రూ.1,400 కోట్లేనా? బీసీలపై ప్రభుత్వ చిన్నచూపునకు ఇదే నిదర్శనం. బీసీలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ ఉండగా, దీన్ని నాలుగు గ్రూపులుగా విభజించాలని కేంద్రం రోహిణి కమిషన్ను ఏర్పాటుచేసింది. కులాలవారీ లెక్కలు లేకపోవడంతో ఈ గ్రూపుల ఏర్పాటు కూడా పెండింగ్లో ఉన్నది. సంక్షేమ కార్యక్రమాల అమలు, అర్హుల గుర్తింపు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు కులాలవారీ బీసీ గణన అవసరం.
-ఆర్ కృష్ణయ్య, ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న బీజేపీ
ప్రధాని మోదీ తాను బీసీనని చెప్పుకొంటూ.. బీసీల అభివృద్ధి, సంక్షేమంలో రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారు. బీసీ జనగణన, ప్రత్యేక మంత్రిత్వశాఖ అనేవి బీసీల అస్తిత్వం, ఆత్మగౌరవ అంశాలు. గతంలోరాజ్నాథ్సింగ్ బీసీ కులగణన కోసం అప్పటి యూపీఏ సర్కారును డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు. బీసీల రిజర్వేషన్పై మండల్ కమిషన్ ఉద్యమం సందర్భంగా, కమండల్ ఉద్యమాన్ని నిర్వహించిన బీజేపీ.. మొదటి నుంచీ బీసీలకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నది. బీసీ కులగణన చేపట్టకుండా సామాజిక న్యాయాన్ని అడ్డుకొంటున్నది. బీసీ కులవృత్తుల ఆధునికీకరణ, యాంత్రీకరణ చేయాలంటే ప్రత్యేక మంత్రిత్వశాఖ తప్పనిసరి. బీసీల అభివృద్ధిపై మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
– జాజుల శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
జీరో జీఎస్టీని అమలు చేయాలి
చేనేత వస్ర్తాలపై పన్ను విధింపు దుర్మార్గం. పన్ను విధించిన తర్వాత చేనేత ఉత్పత్తి, అమ్మకాలు, ఎగుమతులు తగ్గాయని కేంద్ర మే పేర్కొన్నది. జీరో జీఎస్టీ ఉద్యమం తర్వాతే సమస్య తీవ్రత అర్థమైంది. మిగిలిన వస్తువుల్లా చేనేతలో ముడి సరుకు విలువ తక్కువ. కార్మికుడి పనివిలువ ఎక్కువ. ఉదాహరణకు ఒక చేనేత చీర రూ.5 వేలు ఉంటే.. ఇందులో ముడి సరుకు ధర రూ.2 వేలు. మిగిలినది కార్మికుడి శ్రమ విలువ. కానీ జీఎస్టీ రూ.5 వేలకు పడుతున్నది. కేంద్రం చేనేతపై జీరో జీఎస్టీని అమలు చేయాలి.
– యర్రమాద వెంకన్న, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త
మోదీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు?
ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు. రాష్ర్టానికి అడుగడుగునా అన్యాయం చేసిన ప్రధాని.. రాష్ట్ర పర్యటనకు రావడం సిగ్గుచేటు. రామగుండంలోని ఎరువుల కర్మాగారానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండానే దానిని ప్రారంభించేందుకు మోదీ రావటం తెలంగాణను అవమానించటమే. విభజన హామీలలో ఒక్క టి కూడా నెరవేర్చని మోదీకి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతిక హక్కు లేదు. విభజన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాతే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలి.
– టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు
పెట్రోల్ ఖర్చు డబుల్ అయ్యింది
నేను ఈస్ట్ మారేడుపల్లిలో ఉంటూ, మాదాపూర్లో ఉద్యోగం చేస్తున్నాను. గతంలో బైక్పై ఆఫీస్కు వెళ్లిరావడానికి నెలకు రూ.3 వేలు, కారు అయితే రూ.6-7వేలు ఖర్చయ్యేది. ఇప్పుడు బడ్జెట్ డబుల్ అయ్యింది. కారుకు కనీసం రూ.10-11 వేలు అవుతున్నది. బైక్ రూ.5 వేలు దాటుతున్నది. పెట్రోల్ ధరలు నాన్స్టాప్గా పెరిగిపోయాయి. అడిగితే క్రూడాయిల్ ధర పెరిగిందన్నారు. మరి ఇప్పుడు క్రూడాయిల్ ధర తగ్గింది. పెట్రోల్ ధర ఎందుకు తగ్గించరో అర్థం కావడం లేదు.
– శ్రీకాంత్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఈస్ట్ మారేడుపల్లి