కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 17: అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన నేత కార్మికులు శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికుల ఇండ్లల్లో కొన్ని రోజులుగా ఈడీ అధికారులు దాడులు చేస్తూ మరమగ్గాలను సీజ్ చేస్తూ కేసులు పెడుతున్నారని వంద మందికిపైగా చేనేత కార్మికులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. కార్మికులకు ఉపాధి కల్పించాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని నినదించారు. సాదా చీరలు మాత్రమే నేసే జీవో ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మగ్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని కోరారు. గతంలో నేసిన చీరల డబ్బులు విడుదల చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో గర్శకుర్తి గ్రామ చేనేత, పవర్లూమ్ కార్మిక సంఘం గౌరవ సలహాదారుడు అన్నల్దాస్ శ్రీనివాస్, అధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు.