మంచిర్యాల అర్బన్, మార్చి 11 : పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఆందోళన నిర్వహించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్కుమార్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆ కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నెలనెలా వేతనాలు చెల్లించాలని కోరారు.
పెద్దపల్లి, మార్చి 11: మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పంచాయతీ కార్మికులు సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధికారంలోకి వస్తే నెల నెలా జీతాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మెరుపు సమ్మె చేపడతామని హెచ్చరించారు.