హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రైల్వే ఉద్యోగులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటున్న ఇండియన్ రైల్వేపై ఆ సంస్థ ఇంజినీరింగ్ ఉద్యోగులు భగ్గుమన్నారు. రైల్వేబోర్డు తీసుకొంటున్న వ్యతిరేక నిర్ణయాలపై సోమవారం దేశ వ్యాప్తంగా రైల్వే ఇంజినీర్లు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు పద్మనాభం మాట్లాడుతూ.. తమ 18 డిమాండ్లను పరిష్కరించకుండా రైల్వేబోర్డు చోద్యం చూస్తున్నదని, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం వెంటనే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల రైల్వే బోర్డు తీసుకొన్న నిర్ణయాల ప్రకారం.. సేఫ్టీ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రైల్వేలో నిర్మాణ రంగానికి చెందిన ఇంజినీరింగ్ ఉద్యోగులకు సేఫ్టీ అలవెన్సులు 30 శాతం పెంచాలని అన్నారు. రైల్వే ఇంజినీరింగ్ ఉద్యోగులందరికీ రూ.కోటి వరకు బీమా సదుపాయాన్ని కల్పించాలని కోరారు.