హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ‘గోదావరి నది జన్మస్థానమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి నదీ సంగమ బంగాళాఖాతం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోదావరి ఉప నదుల్లో కూడా భారీగా వరద పోటెత్తుతున్నది. ప్రకృతి విపత్తు ఏర్పడిన ఈ కష్టకాలం.. రాష్ట్ర ప్రజలను కాపాడుకొనేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయం’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ఒక్క ప్రాణానికి నష్టం కలుగకుండా ప్రజలకు తలెత్తే అసౌకర్యాలను వీలైనంతగా తగ్గించేలా చర్యలు తీసుకోవడంలోనే ప్రభుత్వ యంత్రాంగం ప్రతిభ ఇమిడి ఉన్నదని చెప్పారు.
పదిహేను రోజులుగా చేస్తున్న కృషిని మరింత పట్టుదలతో కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా వరద పరిస్థితులపై సీఎం ఆరాతీశారు. అనంతరం చేపట్టాల్సిన సహాయక కార్యక్రమాలు, ముంపు నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రెండు వారాలకుపైగా నిరంతరం కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్రమంతా జలమయమైన నేపథ్యంలో ఇకపై పడ్డ చుక పడ్డట్టే, వాగులు వంకలు దాటి, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటుందని చెప్పారు. రెండు రోజుల్లో భారీ వర్షాలున్నాయనే వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో ఇటీవలి కంటే భారీగా వరదలు సంభవించే ప్రమాదం ఉన్నందున ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదురొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
అధికారులు కూడా సమాయత్తమై ఉండాలని ఆదేశించారు. ప్రాణం నష్టం వాటిల్లకుండా అప్రమత్తమై ఇటీవల వరదలప్పుడు చేపట్టినట్టే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవలందించే శాఖలతోపాటు.. వానలు, వరదల సందర్భంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అన్ని శాఖల అధికారులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదేశాలతో తక్షణమే సర్యులర్ జారీచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు కురిసే వానలతో గోదావరి నది ఆదివారం మధ్యాహ్నం నుంచే ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉన్నదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్నిశాఖల సిబ్బంది, అధికారులతో సమన్వయం చేసుకొంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సూచనలు చేసినట్టు సీఎం తెలిపారు. భారీ వర్షాలు ఆగస్టు మొదటివారం దాకా కొనసాగే సూచనలున్నాయని చెప్పారు. ముంపునకు గురయ్యే అవకాశాలు ఎకువగా ఉన్న రామన్నగూడెం, ఏటూరునాగారం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర రాజధానిలో అప్రమత్తంగా ఉండే హెలికాప్టర్కు అదనంగా మరో రెండు హెలికాప్టర్లను రప్పించి ములుగు, కొత్తగూడెంలో సిద్ధంగా ఉంచాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. ఖమ్మం, కొత్తగూడెంలో హెల్త్క్యాంపులను ఏర్పాటుచేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ సహా వరద సహాయ బృందాలను అందుబాటులో ఉంచాలని, తక్షణ రక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జాను ఆదేశించారు.
ఎగువ గోదావరి నుంచి వచ్చిన వరద మొత్తాన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కిందికి వదలాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫ్లోను ఆపొద్దని అన్ని ప్రాజెక్టుల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేయాలని నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ను ఆదేశించారు. మిషన్భగీరథ తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని కృపాకర్రెడ్డికి సూచించారు.
గేట్లు లేకుండా మత్తడి దుంకే డిండి, పాకాల, వైరా పాలేరు రిజర్వాయర్లపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్తు, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎస్ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీచేయాలని డీజీపీని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో వరదలను ముందస్తుగా అంచనా వేసేందుకు రాష్ట్ర ఇరిగేషన్శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం’అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పరిశీలించారు. కురిసే వానలకు అనుగుణంగా హెచ్చుతగ్గులతో ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహాన్ని, గంటగంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసి విశ్లేషించే విధానాన్ని రజత్కుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ఇరిగేషన్శాఖ దేశంలో తొలిసారి అభివృద్ధి చేస్తున్నదని రజత్కుమార్ వివరించగా.. ముఖ్యమంత్రి అభినందించారు. వాతావరణశాఖ హెచ్చరికలను ఆధారంగా భారీవర్షాల వల్ల సంభవించే వరదను అంచనా వేయగలుగుతున్నా, నదుల్లోకి చేరే వరదను అంచనాను వేయలేకపోతున్న సమస్యలకు ఈ సాఫ్ట్వేర్ పరిష్కారం చూపుతుందని చెప్పారు. ముంపుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద నీటికాల్వల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వరదలకు ఉప్పొంగే జల్పల్లి, పీర్జాదిగూడ చెరువుల పరిస్థితిని, వరద సమయాల్లో విద్యుత్తు వ్యవస్థ గురించి పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తదితరశాఖల ఉన్నతాధికారులను అడిగి తెలుసుకొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉన్నదా?
తీసుకొన్న చర్యలేమిటని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును, అధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వరద ఆగిపోయాకే ఎకువగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నదని, అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దండే విఠల్, శంభీపూర్ రాజు, ప్రభుత్వ విప్, బాల సుమన్, ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, సీఎం సెక్రటరీలు శేషాద్రి, స్మితా సబర్వాల్, రాహుల్ బొజ్జా, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని..ఆరోగ్యశాఖ డైరెక్టర్ సహా అధికారులను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. డెంగ్యూ విజృంభణ ఐదేండ్లకోసారి పునరావృతమవుతున్నదని, ముందస్తుగానే గుర్తించి అరికట్టాలని మంత్రిని, వైద్యాధికారులను ఆదేశించారు.
మున్సిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. వానలు, వరదల కారణంగా కొట్టుకుపోతున్న రోడ్లను, రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని ఆర్అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ పరిధిలో రోడ్ల పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు.
దెబ్బతిన్న నేషనల్ హైవే రోడ్లను పునరుద్ధరిస్తున్నామని మంత్రి వేముల వివరించారు. ఈ వరదల ద్వారా వచ్చిన అనుభవంతో సబ్స్టేషన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వరద ముంపునకు లోనుకాకుండా రాష్ట్రంలోని సబ్స్టేషన్ల కాంటూర్ లెవల్స్ను రికార్డు చేసుకొని ఉంచుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 కేవీ సబ్స్టేషన్లు ఏ విధంగా నియంత్రణలో ఉన్నాయనే సమాచారాన్ని సేకరించాలని సూచించారు.