హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో అత్యంత విజయవంతంగా గనుల అన్వేషణ, గుర్తింపు, అభివృద్ధి పనులు చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్నది. 2014 నుంచి టీఎస్ఎండీసీ ద్వారా ప్రభుత్వానికి రూ.5,072.76 కోట్ల ఆదాయం సమకూరింది. 98 ఇసుక రీచ్లను నిర్వహిస్తూ పారదర్శకంగా తక్కువ ధరకే ఇసుకను ప్రజలకు సమకూరుస్తున్నది. టీఎస్ఎండీసీని కేంద్ర గనుల శాఖ జనవరి 5, 2016న నేషనల్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (ఎన్ఈఏ)గా గుర్తించింది. ఈ సంస్థ తెలంగాణతోపాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 10 మైనింగ్ అన్వేషణ ప్రాజెక్టు పనులు పూర్తిచేసింది. టీఎస్ఎండీసీకి ఐఎస్వో 9001:2015 గుర్తింపు ఉండటం గమనార్హం. ఉత్తమ సేవలకు స్కోచ్ అవార్డు, ఏఎస్ఐఏ-ఈఎల్ఈటీఎస్ టెక్నోమీడియా అవార్డులను అందుకొన్నది.