జహీరాబాద్ : రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని, తద్వారా అధిక లాభాలు సాధించవచ్చని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రేజింతల్లోని స్వయంభు సిద్ధి వినాయకుడిని మంత్రి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పాలీహౌస్ను సందర్శించారు. అందులో సాగవుతున్న రంగురంగుల క్యాప్సికం, గెర్కీన్ పంటను పరిశీలించారు.
సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్, ఆదాయం వంటి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, సాగు పద్దతులపై స్థానిక రైతులకు అవగాహన కల్పించాలని హరీశ్రావు పాలీహౌస్ నిర్వాహకులకు సూచించారు. అనంతరం మాణిక్రావుతో కలిసి మంత్రి జహీరాబాద్ మున్సిపాలిటీలో పరిధిలో నగరబాటలో భాగంగా పలు వార్డుల్లో సైకిల్పై పర్యటించారు. క్షేత్రస్థాయిలో మహిళలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.