హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ సీ కాశీం ప్రశ్నించారు. సోషల్మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ‘నా చేతిలోనే విద్యారంగం ఉంటే ఆ శాఖ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడంతోపాటు బడ్జెట్ కేటాయించడానికి చాన్స్ ఉంటుంది.
డబ్బులు ఉండే ఆర్థిక, రెవెన్యూ, పరిశ్రమల శాఖలు నా వద్ద పెట్టుకోకుండా డబ్బులు ఖర్చు చేసే విద్యాశాఖను పెట్టుకున్నాను’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి తన వద్ద పెట్టుకోవడం సంతోషమే కానీ, రాష్ట్రంలో ఓ విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఎంతమంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులకు అవకాశం దొరుకుతుందని ప్రొఫెసర్ కాశీం ప్రశ్నించారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎంను కలవాలంటే ప్రొటొకాల్ ఉంటుందని, అపాయింట్మెంట్ దొరకడానికి చాలా సమయం పడుతుందని ప్రొఫెసర్ కాశీం పేర్కొన్నారు. సీఎం వద్ద టైం ఉండనప్పుడు విద్యారంగ సమస్యలు ఎవరికి విన్నవించాలని, ఎవరు పరిష్కారిస్తారని ప్రశ్నించారు. రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. ఇప్పటికైనా, సీఎం 15 రోజులకోసారి విద్యారంగ సమస్యలపై మేధావులు, విద్యార్థి సంఘాలతో చర్చించేందుకు రెండు గంటల సమయం కేటాయించాలని కోరారు. గతంలో ఓయూలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన కాశీంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘సీఎం రేవంత్రెడ్డి గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు విద్యని ప్రేమిస్తున్నారు’ అని అన్నారు కదా.. అని కాశీంను ఉద్దేశించి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.