KCR | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ జయంతి(నేడు) సందర్భంగా ఆయన తెలంగాణ కోసం చేసిన కృషి, త్యాగాన్ని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. తొలిదశ నుం చి మలి దశ ఉద్యమం దాకా తెలంగాణ సాధన దిశగా ప్రొఫెసర్ జయశంకర్ చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాలపాటు సాగిన ఉద్యమంలో వా రు అందించిన పోరాటస్ఫూర్తిని కేసీఆర్ కొనియాడారు. వారి అడుగుజాడల్లో తాను మలిదశ ఉద్యమానికి సారథ్యం వహించి, చివరి దాకా శాంతియుత పద్ధతిలో, పార్లమెంటరీ పంథాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించినట్టు చెప్పారు.
చివరకు అరవై ఏండ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్ర సాధ న అనంతరం ప్రజల మద్దతుతో మొట్టమొదటి ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే కొనసాగించామని కేసీఆర్ తెలిపారు. ఉద్యమాన్ని నడిపి గమ్యాన్ని చేరుకోవడంలోనూ, తదనంతరం పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించడంలోనూ వారి స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను, సకలజనులను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన బీఆర్ఎస్ పాలన స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలంగాణను మరింతగా ప్రగతి పథంలో నడిపేలా కృషి చేయడమే వారికందించే ఘననివాళి అని కేసీఆర్ తెలిపారు.