హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం భారత ప్రజాస్వామ్యంపై అణుబాంబు దాడి వంటిదని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అభివర్ణించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టీ-న్యూస్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ నవనాడులపై దాడి అని, దేశ రాజకీయ వ్యవస్థనే చిన్నాభిన్నం చేసే ఘటన అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రంపైనే ఆరోపణలు ఉన్నందున న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని కోరారు. కేరళకు చెందిన తుషార్తోపాటు ఆపరేషన్లో పాల్గొన్న ముగ్గురు స్వాములను కూడా విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ నేతలు కచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఒకవేళ ఇవన్నీ తప్పుడు ఆరోపణలే అయితే, వీటిలో నిజం లేకపోతే బీజేపీ నేతలు కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఆరోపణలు చేసినవారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. ఇంత పెద్ద వీడియో రిలీజ్ అయితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉన్నదని, ప్రజాస్వామ్యానికి ఇంత కన్నా ప్రమాదం లేదని పేర్కొన్నారు. ఒకసారి ఎన్నికైన ప్రభుత్వాల జోలికి ఎవరూ వెళ్లకూడదని స్పష్టంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షాలను కూడా బీజేపీ వదలిపెట్టడం లేదని, ఇందుకు శివసేన, నితీశ్కుమార్ ఉదాహరణ అని చెప్పారు. తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారని అన్నారు. బీజేపీ చెప్తున్న వన్నేషన్ కాన్సెప్ట్ దేశానికి అత్యంత ప్రమాదకరమని, ఇది యాంటీ హిందూ, యాంటీ ఇండియా నినాదమని ఆగ్రహం వ్యక్తంచేశారు