హనుమకొండ, మే 21: కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు మోదీ సర్కారు కంకణం కట్టుకొన్నదని ఆరోపించారు. కార్మిక చైతన్య మాసోత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ సుబేదారిలోని అసంతభవన్లో ‘ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ-సామాజిక న్యాయం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా కే నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఓవైపు సిమెంట్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేసిందని మండిపడ్డారు. ఎల్ఐసీని కేంద్రం అమ్మకానికి పెట్టడం, రాజ్యాంగ, చట్టవిరుద్ధమన్నారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కారు : దాస్యం
పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. లాభాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రక్రియను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డిజిటలైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.