హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): దేశంలో మతద్వేషాలు పెట్రేగుతున్నాయని, రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడుతున్నాయని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్లోని లామాఖాన్లో నిర్వహించిన ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామిక హక్కులు, వాక్ స్వాతంత్య్రం, లౌకికతత్వం, సౌభ్రాతృత్వం మన రాజ్యాంగంలోని ముఖ్య విలువలని, గత పదేండ్ల నుంచి ఈ విలువలన్నీ ప్రమాదంలో పడ్డాయని విచారం వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ కంకణం కట్టుకున్నాయని ధ్వజమెత్తుతూ.. ఇలాంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘రాజ్యాంగ విలువలను, మత సామరస్యాన్ని కాపాడుకోవడంలో పౌరుల పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన, షార్ట్ వీడియో, నినాదాల పోటీలను నిర్వహించారు. 35 కాలేజీలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రొ. హరగోపాల్, ఖలీదా ఫర్వీన్ బహుమతులను అందజేశారు.