హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలలు కీలకమైనవని, ప్రతిరోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. అదే స్థాయిలో రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు. శుక్రవారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సీఎండీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకొన్న 7 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి రోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని అన్నారు. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల్లో తమకు కేటాయించిన లక్ష్యాలను రోజువారీగా సాధించడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈయేడు అతి భారీ వర్షాలు కురవడంతో ఉత్పత్తికి కొంత ఆటంకం కలిగిందని పేర్కొన్నారు.
ఓపీల్లో వెలికితీత పనులు ఏజెన్సీలకు..
ఓపెన్ కాస్ట్ల్లో ఓవర్ బర్డెన్ వెలికితీత పనులు పొందిన ఏజెన్సీలు రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించేలా జీఎంలు చొరవ చూపాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. గత నెలలో అత్యధికంగా ఓబీ వెలికితీతలో 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైలురాయిని తొలిసారి దాటినట్టు వెల్లడించారు. గరిష్ఠస్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్న మణుగూరు, ఇల్లెందు, ఆర్జీ-1, ఆర్జీ-2 ఏరియాల సిబ్బందిని అభినందించారు. విద్యుత్తు వినియోగం పెరిగిన నేపథ్యంలో బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్నదని, ఉత్పత్తి అయిన బొగ్గును వినియోగదారులకు అందించడం కోసం తగినన్ని ర్యాక్లు సమకూర్చుకోవడానికి కోల్ మూమెంట్ శాఖ, రైల్వేతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం, డీ సత్యనారాయణరావు, అడ్వైజర్ డీఎన్ ప్రసాద్, ఈడీ జె అల్వీన్, జీఎంలు సురేష్, సూర్యనారాయణ, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.