హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని, హరితహారం పథకంతో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బీడీ కార్మికులకు సేకరణ చార్జీలు, బోనస్ను అన్లైన్ ద్వారా నేరుగా ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. సుమారు లక్ష మంది లబ్ధిదారులకు రూ.220 కోట్ల బోనస్ను చెల్లించటం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ మేరకు శనివారం అటవీశాఖ పనితీరు, పురోగతిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అటవీ శాఖకు జాతీయస్థాయి గుర్తింపు రావటం సంతోషకరమని చెప్పారు. హరితహారాన్ని విజయవంతం చేసి, గణనీయంగా పచ్చదనం పెరిగేందుకు కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, భాగస్వామ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రభుత్వ అభివృద్ది పనులకు అటవీ భూములను వినియోగించుకున్నప్పుడు, ప్రత్యామ్నాయ భూముల్లో కంపా నిధుల ద్వారా అడవులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కోతుల బెడద అధికంగా ఉన్నదని, దీని నివారణకు నిర్మల్లో నెలకొల్పిన స్టెరిలైజేషన్ సెంటర్ తరహాలో దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని సూచించారు. శాఖాపరంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. సమీక్షా సమావేశంలో పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖరరెడ్డి, అటవీశాఖ జాయింట్ సెక్రటరీ ఎం ప్రశాంతి, పీసీసీఎఫ్లు లోకేశ్ జైస్వాల్, ఎలూసింగ్ మేరు, ఎంసీ పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.