హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం దేశంలో 12 రాష్ర్టాలు తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ఇస్తున్నారు. ఇండ్లకు సైతం గంటల తరబడి విద్యుత్తు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రాష్ర్టాల్లో అత్యవసరాల కోసం జనరేటర్లపై ఆధారపడుతుండటంతో ఖర్చు నాలుగు రెట్లు అధికమవుతున్నది. తెలంగాణలో మాత్రం వ్యవసాయంతోసహా అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నారు. దీంతో విద్యుత్తు కోతలే లేని రాష్ట్రంగా తెలంగాణ యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
చివరిదాకా మేల్కొనకుండా..
దేశంలో 70 శాతానికిపైగా విద్యుత్తు ఉత్పత్తి థర్మల్ ప్రాజక్టుల ద్వారానే జరుగుతున్నది. అందుకు అవసరమైనంత స్థాయిలో బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సిన పలు రాష్ర్టాలు.. చివరి నిమిషం వరకు మేల్కొనకుండా ప్రజలను, పరిశ్రమవర్గాలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. రాజస్థాన్లోని 7, ఉత్తరప్రదేశ్లోని 3 థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటడంతో విద్యుత్తు సరఫరా గణనీయంగా పడిపోయింది. దీంతో ఆ రెండు రాష్ర్టాల్లో పరిశ్రమలకు వారంలో 3 రోజులు పవర్ హాలిడే విధించడంతోపాటు ఇండ్లు, వాణిజ్య అవసరాలకు రోజూ 10-12 గంటలు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. హర్యానాలో భాగంగా ఉన్న ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. గుర్గావ్ పారిశ్రామికవాడలో డీజీ పవర్ (డీజిల్ జనరేటర్ల ద్వారా సరఫరా చేసే విద్యుత్తు)కు యూనిట్కు రూ.28.87 చొప్పున చెల్లించాల్సి వస్తున్నది. దీనికి జీఎస్టీ కూడా తోడవటంతో సాంప్రదాయ విద్యుత్తు ధర కంటే నాలుగు రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని అక్కడి పారిశ్రామికవర్గాలు వాపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలో పరిశ్రమలకు వారంలో 2-3 పవర్ హాలీడే ఇస్తున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ర్టాల్లో అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో పనుల్లేక వారంలో 3 రోజులు పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించిందని కార్మికులు వాపోతున్నారు.
మే చివరిదాకా కష్టాలే..
ప్రస్తుతం విద్యుత్తు డిమాండ్ 38 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మే నెలాఖరు వరకు కష్టాలు తప్పవని వివిధ రాష్ర్టాలు చెప్తున్నాయి. విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పూర్తిగా తగ్గిపోవడం, రోజూ 2 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం పెను సవాలుగా పరిణమించడం ఇందుకు కారణాలు. వీటి వల్ల ఈ నెలలో విద్యుత్తు కొరత 0.3 నుంచి 1 శాతానికి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో చత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ సంస్థ టారిఫ్ను 15 పైసలు పెంచింది. దీనికి తోడుగా ఎనర్జీ ఎక్సేంజ్ ప్రకారం విద్యుత్తు సగటు కొనుగోలు ధర 13 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుత సగటు కొనుగోలు ధర కిలోవాట్కు రూ.8.23గా ఉన్నది. ఇది 2021 మార్చితో పోల్చితే రెండింతలు అధికం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సహా పలు రాష్ర్టాల్లోని విద్యుత్ నియంత్రణ సంస్థలు టారిఫ్ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ర్టాలు
పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.
తెలంగాణలో నిరంతర విద్యుత్తు
ప్రస్తుతం మొత్తంగా సగానికిపైగా దేశం విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే.. తెలంగాణలో మాత్రం అటువంటి సమస్యేమీ లేదు. ఇప్పటిదాకా నివాస, వాణిజ్య అవసరాలకు ఎటువంటి విద్యుత్తు కోతలు విధించకపోవడం విశేషం. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తుకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేస్తూ ఎలాంటి కొరత రానివ్వకుండా చూస్తున్నది. దీంతో సామాన్యులే కాకుండా రైతులు, కార్మికులు, పరిశ్రమవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. స్వరాష్ట్ర ఏర్పాటుకు పూర్వం తెలంగాణలో పారిశ్రామిక, గృహ విద్యుత్తు అవసరాలకు జనరేటర్లు, ఇన్వర్టర్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు మచ్చుకైనా వాటి జాడ కనిపించడం లేదు.
కరెంటు కష్టాలను మర్చిపోయాం..
స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో పరిశ్రమలు కరెంటు కష్టాలను మర్చిపోయాయి. రాష్ట్రంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా అవుతుండటంతో పారిశ్రామిక ఉత్పత్తులకు ఎలాంటి ఆటంకాలు కలగడంలేదు. యజమానులు, కార్మికులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపే ఇందుకు కారణం. గతంలో లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన జనరేటర్లు ఇప్పుడు నిరుపయోగంగా తుప్పుబట్టి పోతున్నాయి.
– గోపాల్రావు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఉపాధ్యక్షుడు