గజ్వేల్ అర్బన్, జూలై 4: తక్కువ ఖర్చుతో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన గొప్ప ప్రాజెక్టు మిషన్ భగీరథ అని ప్రొబేషనరీ ఐఏఎస్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. తెలంగాణకు కేటాయించిన 2022 బ్యాచ్కు చెందిన ఐదుగురితో కూడిన ప్రొబేషనరీ ఐఏఎస్ల బృందం మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ సంప్హౌస్ను సందర్శించింది.
మిషన్ భగీరథ ప్లాంట్ ఏర్పాటు లక్ష్యం, రూపకల్పన, నీటి సేకరణ, శుద్ధీకరణ, నీటి సరఫరా తదితర వివరాలను ఎస్ఈ శ్రీనివాసాచారి, ఈఈ రాజయ్య.. ఐఏఎస్ అధికారులకు వివరించారు. ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రొబేషనరీ ఐఏఎస్లు శారదశుక్ల, కిరణ్మయి కొప్పిశెట్టి, వికాస్ మెహతా, ఉమాశంకర్ ప్రసాద్, మయోంక్ సింగ్ భగీరథ పథకం అద్భుతమంటూ ప్రశంసించారు. దేశంలోనే మొట్టమొదట తెలంగాణ ప్రభుత్వం అనితర సాధ్యమైన పథకాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు.