హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేయడం చారిత్రక తప్పిదమని, ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) హైదరాబాద్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ అబిడ్స్లో జరిగిన ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నగరశాఖ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన..ఆర్థికవేత్తలు, మేధావి వర్గం పదేపదే హెచ్చరించినా, పాలసీదారులు, ఏజెంట్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎల్ఐసీ ఐపీవో పేరుతో ప్రైవేటీకరణకు యత్నించడం తగదన్నారు.
ఇలాంటి చర్యల వల్ల ఏజెంట్లు ఆందోళన చెందుతున్నారని, ఇది ఒకరకంగా వారి నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యతరగతి ప్రజలు కష్టపడి దాచుకొన్న సొమ్మును కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు పాలకులు నూతన విధానాలు తీసుకరావడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పాలసీదారులకు సేవలందిస్తూనే ఉద్యోగులు, ఏజెంట్లు ఐక్యతను ప్రదర్శించాలని సూచించారు. అనంతరం కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నగరశాఖ పలు తీర్మానాలు చేసింది.
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నగరశాఖను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా కృష్ణ య్య, ఉపాధ్యక్షుడిగా వీ వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా రమేశ్గౌడ్, జాయింట్ సెక్రటరీలుగా సీహెచ్బీ శర్మ, బీవీ రమణ, ట్రెజరర్గా శివరామకృష్ణ, ఈసీ మెంబర్లుగా జే సంజయ్, సుమరంజిత, సోమశేఖర్ ఎన్నికయ్యారు.