హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత మోగుతున్నది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో భారీగా ఫీజులున్నాయి. సగటు ఫీజు రూ. 41,475గా ఉంది. రాష్ట్రంలో బీటెక్ కనిష్ఠ ఫీజు రూ. 36వేలు కాగా, అంతకంటే బడుల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. అర్బన్ ప్రాంతాలే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని బడులు కూడా తామేం తక్కువకాదంటున్నాయి. ఈ స్కూళ్లల్లో సగటు ఫీజు రూ.35,104గా ఉంది. అంటే పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ బడుల ఫీజులకు తేడా ఆరువేలే కావడం గమనార్హం. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినవే. అసెంబ్లీకి సమర్పించిన సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ వివరాలు సర్కార్ పొందుపరిచింది. ప్రాంతాలవారీగా, యాజమాన్యాలవారీగా సగటు ఫీజుల వివరాలు సర్కార్ ఈ నివేదిక ద్వారా వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు రూ. 2,286 మాత్రమే. అదే ఎయిడెడ్ బడుల్లోని తల్లిదండ్రులు రూ. 28,420, ఇతర బడుల్లో రూ.4,907, నాన్ గవర్నమెంట్ స్కూళ్లల్లో రూ. 34,012 చొప్పున ఖర్చుచేస్తుండగా అదే ప్రైవేట్ బడుల్లోని తల్లిదండ్రుల వ్యయం రూ. 35,104గా ఉంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని సర్కార్ స్కూళ్లల్లో తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు రూ.3,963 మాత్రమే. అదే ఎయిడెడ్ బడుల్లోని తల్లిదండ్రులు రూ. 32,951, ఇతర బడుల్లో రూ.3,260, నాన్ గవర్నమెంట్ స్కూళ్లల్లో రూ. 38,884 చొప్పున ఖర్చుచేస్తుండగా అదే ప్రైవేట్ బడుల్లోని తల్లిదండ్రుల వ్యయం రూ.41,475గా ఉంది.