మహబూబ్నగర్: మహబూబ్నగర్లో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. గురువారం రాత్రి కురిసిన వానతో కోడూరు-మాచన్పల్లి మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. అయితే రామచంద్రపూర్, మాచన్పల్లి, సుగుర్గడ్డ తండా నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులు స్కూలు బస్సులో వెళ్తున్నారు.
ఈ క్రమంలో అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రాక్టర్ సహాయంతో స్కూలు బస్సును బయటకు తీశారు. చిన్నారులంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.