హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): దేశంలో విద్యుత్తు వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు ఏ చిన్న అవకాశం దొరికినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)ను నామమాత్రం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు అర్థమవుతున్నది. అందులో భాగంగానే ఇప్పటివరకు విద్యుత్తు పంపిణీకి దోహదం చేసే అంతర్రాష్ట్ర 400 కేవీ లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణం, నిర్వహణ పనులు చూస్తున్న పీజీసీఐఎల్ను వాటినుంచి దూరం పెట్టేందుకు చర్యలు చేపట్టింది. 400 కేవీ లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన పనుల టెండర్లలో పీజీసీఐఎల్ పాల్గొనకుండా డిబార్ చేయాలన్న ప్రైవేటు సంస్థల విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించడం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
సీటీయూఐఎల్ ఏర్పాటుతో పీజీసీఐఎల్ పని నామమాత్రమైంది. పీజీసీఐఎల్ మాత్రం ఇప్పటివరకు నిర్మించిన సబ్స్టేషన్లు, లైన్ల నిర్వహణ మాత్రమే చూసుకుంటుందన్నమాట. కొత్తగా నిర్మించబోయే సబ్స్టేషన్లు, 400 కేవీ లైన్ల పనుల టెండర్లలో పీజీసీఐఎల్ పాల్గొనకుండా డిబార్ చేయాలంటూ ప్రైవేటు విద్యుత్తు సరఫరా సంస్థల సంఘం (ఈపీటీఏ) నేరుగా కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్కు విజ్ఞప్తి చేసింది. ఇందుకు ఈపీటీఏ డైరెక్టర్ జనరల్ విజయ్ చిబ్బర్ ఒక కారణాన్ని చూపారు. ‘సీటీయూఐఎల్ ఇంకా పీజీసీఐఎల్ నియంత్రణలోనే ఉన్నది. పీజీసీఐఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్) ఇప్పుడు సీటీయూఐఎల్కు చైర్మన్గా కొనసాగుతున్నారు. దీనివల్ల మాకు టెండర్లు రావడం లేదు. గరిష్టంగా పీజీసీఐఎల్కే వెళుతున్నాయి. అన్ని రకాల అనుభవం, ప్రాజెక్టుల రూపకల్పన, డిజైన్లలో పాలుపంచుకొనే పీజీసీఐఎల్.. ఆయా ప్రాజెక్టులకు పిలిచే టెండర్లలో అతి తక్కువగా కోట్ చేస్తున్నది. అక్కడి డైరెక్టర్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు చైర్మన్గా ఉండటంతో.. టెండర్లు పీజీసీఐఎల్కే కట్టబెడుతున్నారు’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. దీనిని సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే 400 కేవీ లైన్ల ఏర్పాటుకు సంబంధించి పలు కాంట్రాక్టులను చేజిక్కించుకున్న ప్రైవేటు సంస్థలు నాసిరకంగా పనులు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండరు నిబంధనల ప్రకారం.. లైన్లను నిర్మించిన సంస్థ.. 20-25 సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తరువాత లైన్లను పీజీసీఐఎల్కు బదలాయించాలి. నిజానికి పీజీసీఐఎల్ అయితే 40-50 సంవత్సరాల పాటు నిలిచేలా లైన్లను నిర్మిస్తుందని.. ప్రైవేటు సంస్థలు మాత్రం.. తమ నిర్వహణ కాలం (20 నుంచి 25 ఏండ్లు) వరకు మాత్రమే మన్నేలా నాసిరకంగా పనులు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పీజీసీఐఎల్ను నిర్వీర్యం చేయడం వల్ల దాని పరిధిలో పనిచేసే సిబ్బందికి చేతినిండా పని ఉండదని, ఆ కారణంతో ఉద్యోగాలకు మంగళం పాడే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. కేంద్రమే.. కుట్రపూరితంగా సంస్థలను నిర్వీర్యం చేసి.. ప్రైవేటీకరించడానికి సహాయ పడుతున్నదనే అనుమానాలు బలపడుతున్నాయని విద్యుత్తు సంస్థల ఉద్యోగులు పేర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర 400 కేవీ లైన్ల ఏర్పాటు, వాటికి అనుబంధంగా సబ్స్టేషన్ల నిర్మాణాన్ని మొదటి నుంచి పీజీసీఐఎల్ చేపడుతున్నది. అలాగే ఈ లైన్లు, సబ్స్టేషన్ల నిర్వహణ కూడా పీజీసీఐఎల్ చేతిలోనే ఉన్నది. అయితే పీజీసీఐఎల్ను విభజించిన కేంద్రం కొత్తగా సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీటీయూఐఎల్)ను కొంతకాలం క్రితం ఏర్పాటుచేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 400 కేవీ లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణానికి సీటీయూఐఎల్ టారిఫ్ బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ) పద్ధతిలో టెండర్లు పిలుస్తుంది. ఈ టెండర్లలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొనవచ్చు. అయితే ప్రభుత్వరంగంలో ఉన్న పీఈసీఐఎల్ను ఈ టెండర్లలో పాల్గొనకుండా చేసేందుకు ప్రైవేటు సంస్థలు కుట్రలు చేస్తున్నాయి.
నిజానికి ఈ తతంగం వెనుక అసలు ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 400 కేవీ లైన్లు, సబ్స్టేషన్లను ప్రైవేటుపరం చేయడమేనని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రైవేటుకు అప్పగించే ఉద్దేశం లేని కేంద్రం.. పీజీసీఐఎల్ను విభజించి సీటీయూఐఎల్ను ఎందుకు ఏర్పాటు చేసిందని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముందుగా కొత్త ప్రాజెక్టులకు టెండర్లు పిలిచే సాకుతో.. పీజీసీఐఎల్ను విభజించారు. ఇప్పుడు టెండర్లలో పాల్గొనకుండా దానిని డిబార్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ల మాటలకే కేంద్రం తలూపుతుంది’ అని విద్యుత్తు సంఘాలు మండిపడుతున్నాయి.