హైదరాబాద్ : ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా కృష్ణా నదీ కింద ఉన్న ప్రాంతాలకు తాగునీటి ( Drinking ) కోసమే నీటి విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ( KRMB ) నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ ( Sateesh ) అధ్యక్షతన తెలంగాణకు చెందిన ఈఎన్సీ సభ్యుడు రమేశ్ బాబు( Ramesh ), ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈఎన్సీ సభ్యుడు నరసింహమూర్తి ( Narasimhamurthy ) సమావేశం పాల్గొన్నారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎల్నినో దృష్ట్యా తాగునీటికే వాడుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించిందని తెలంగాణ ఈఎన్సీ సభ్యుడు రమేశ్ బాబు తెలిపారు. తాగునీటికి 50శాతం చొప్పున ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని తెలంగాణ తరుఫున చెప్పామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశామని వెల్లడించారు. సమావేశం సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసిందని తెలిపారు. ఆ రోజున కేవలం తాగునీటి అవసరాలపైనే చర్చ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో నీటిప్రవాహాలు పెరిగితే మళ్లీ ఆలోచిస్తామని చెప్పామని ఆయన వివరించారు.
ఏపీ ఈ ఎన్సీ సభ్యుడు నరసింహమూర్తి మాట్లాడుతూ ఏడాది మొత్తం నీటి వాడకంపై తెలంగాణ ప్రతిపాదించిందని, తాము అక్టోబర్ వరకే ప్రతిపాదించామని తెలిపారు. అప్పటి వరకు 47 టీఎంసీలు అడిగామని సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. రెండు రాష్ట్రాల వాటా అంశం చర్చకు రాలేదని అన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీటి వాటాలపై చర్చించామని తెలిపారు.