అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 14 : తన అనుమతి లేకుండా పుస్తకాలు, పెన్నులు ఎలా తీసుకుంటారంటూ విద్యార్థులను ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన జోగుళాంబ గద్వా ల జిల్లాలో చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మాజ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సోమవారం పరీక్షలు ముగిశాయి. ఇండ్ల కు వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న పదో తరగతి పుస్తకాలు, కంపాక్స్లు, పెన్నులను 6, 7, 9వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులు తీసుకున్నారు.
తన అనుమతి లేకుండా పుస్తకాలు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం తో విద్యార్థులను ఓ గదిలో వేసి ప్రిన్సిపాల్ రామకృష్ణ విచక్షణారహితంగా చితకబాదాడు. నడువలేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని తల్లిదండ్రులకు ఫోన్లుచేసి చెప్పడంతో మంగళవా రం వారు పాఠశాల వద్దకు చేరుకున్నారు.
ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు ఏమీ కాలేదని చూయించడానికి వీలుకాదంటూ గేటుకు తాళంవేశారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు.