కేంద్రం నుంచి రెండు పద్దుల రూపంలో రాష్ట్రాలకు ఆర్థిక ఆసరా అందుతుంది. ఇందులో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా ఒకటైతే, వివిధ పథకాల అమలుకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరొకటి. కేంద్ర పన్నుల వాటా రూ.18 వేల కోట్లకు పైగా అందుతుందని తెలంగాణ అంచనా వేయగా.. కేంద్రం దానిని రూ.12,407 కోట్లకు కుదించింది. అందులో ఫిబ్రవరి వరకు రూ.11,750 కోట్లు అందించింది. రెండోది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.41,001 కోట్లు వస్తుందని తెలంగాణ అంచనా వేయగా, వచ్చింది కేవలం రూ.9324 కోట్లు. అంటే.. బడ్జెట్ అంచనాల్లో 22 శాతం మాత్రమే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఉత్తరప్రదేశ్కు రూ.42,983.36 కోట్లు ఇచ్చింది. తెలంగాణకు మాత్రం రూ.9324 కోట్లు మాత్రమే విదిల్చింది. తెలంగాణ కంటే ఉత్తరప్రదేశ్కు ఇచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్.. ఇంచుమించుగా నాల్గున్నర రెట్లు ఎక్కువ.
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాని.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. విభజన హామీలను ఏనాడో తుంగలో తొక్కిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్షను చూపుతున్నది. తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రాజెక్టులను బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించిన కేంద్ర ప్రభుత్వం.. చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నది. తెలంగాణ సొంతకాళ్లపై నిలబడుతూ పటిష్ఠ ప్రణాళికతో ఆర్థికాభివృద్ధిలో దూసుకెళుతున్నా.. కేంద్రం మాత్రం నిత్యం వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ బీజేపీ పాలిత రాష్ర్టాల విషయంలో ఒక విధంగా, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలలో మరో విధంగా వ్యవహరిస్తున్న కేంద్రం.. తెలంగాణ పట్ల మాత్రం ఏమీ ఇవ్వం ఏం చేస్తారో చేస్కోండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
కేంద్రం నుంచి తెలంగాణకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు తదితరాలు అన్నీ కలిపి రూ.34,149 కోట్లు రావాల్సి ఉన్నది. ఇక పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ విడుదలలో ఏనాడూ పారదర్శకంగా వ్యవహరించలేదు. ఏవో కుంటి సాకులు చెప్తూ.. నిధులను ఇవ్వకుండా వేధిస్తున్నది. ఇక ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చినా బడ్జెట్ అంచనాల్లో ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 22 శాతం మాత్రమే. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్కు మాత్రం 11 నెలల్లో దాదాపు రూ.43 వేల కోట్లు ఇచ్చింది. ఇది తెలంగాణకు చేసిన కేటాయింపుల కంటే నాలుగున్నర రెట్లు ఎక్కువ.
అన్ని రాష్ర్టాల మాదిరిగానే తెలంగాణ కూడా ఆర్థిక ప్రణాళికను రూపొందించుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తుందని ఆశించిన నిధులు రూ.41,001 కోట్లు అందుతాయని అంచనా వేసింది. అయితే ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ నెలలో ఇచ్చింది రూ.189 కోట్లు అయితే, ఆ మరుసటి నెలలో ఇచ్చింది కేవలం రూ.101 కోట్లు మాత్రమే. ఆ తరువాతి నెలల్లో కొద్ది పెంచి తిరిగి అక్టోబర్లో రూ.85 కోట్లు మాత్రమే విదిల్చింది. ఇలా ప్రతినెలా గ్రాంట్ ఇన్ ఎయిడ్లో కోతలు విధిస్తూ ఫిబ్రవరి నెల వరకు ఇచ్చింది మొత్తంగా రూ.9,324 కోట్లు మాత్రమే. రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో కేంద్రం నుంచి 11 నెలల్లో వచ్చింది 22 శాతం మాత్రమే. ఇక మిగిలిన ఈ నెల చివరి రోజున ఎంత విడుదల చేస్తుందో ఇంకా వెల్లడి కాలేదు.
తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దులో కోత పెడుతున్న కేంద్రం.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం ఉదారంగా విడుదల చేస్తున్నది. రాష్ట్రాలు చిన్నవైనా, పెద్దవైనా, వాటి వార్షిక బడ్జెట్ పద్దు ఎంత అన్న దానితో నిమిత్తం లేకుండా 55 నుంచి 80 శాతం వరకు నిధులు కుమ్మరిస్తున్నది. ఇక ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్కైతే ఆ రాష్ట్ర బడ్జెట్ అంచనాలను మించి 112 శాతం నిధులు ఇచ్చేసింది. గుజరాత్ బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ను రూ.15,982 కోట్లుగా అంచనా వేయగా, కేంద్రం ఫిబ్రవరి నాటికే రూ.17,856 కోట్లు విడుదల చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు కర్ణాటకకు 81 శాతం, మహారాష్ట్ర 64 శాతం, హిమాచల్ప్రదేశ్కు 81 శాతం, మధ్యప్రదేశ్కు 59 శాతం, ఉత్తరాఖండ్కు 66 శాతం, త్రిపురకు 57 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ను అందజేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్కు బడ్జెట్ అంచనాల్లో 66 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చింది. ఇక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు కూడా 56 శాతం ఇచ్చారు. అన్ని రాష్ర్టాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. తెలంగాణపై మాత్రం దారుణమైన వివక్షను చూపుతున్నది.
తెలంగాణకు రావాల్సిన కేంద్ర పన్నుల వాటాను కూడా కేంద్రం భారీగా కుదించింది. 2022-23లో కేంద్ర పన్నుల వాటాగా తెలంగాణకు రూ. 18 వేల కోట్లకు పైగా అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. కానీ కేంద్రం దీన్ని రూ.12,407 కోట్లకు కుదించింది. చివరికి కుదించిన పన్నుల వాటాను సైతం సక్రమంగా ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నది. ఫిబ్రవరి వరకు రూ.11,750 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా రూ.657 కోట్లు రావాల్సి ఉన్నది. ప్రతిసారీ ఏదో ఒక సాకును చూపుతూ నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నది. అన్నింటా తెలంగాణపై వివక్షను చూపుతూనే ఉన్నది.