హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 5న హైదరాబాద్ రానున్నారు. శనివారం ఆయన ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవాలతోపాటు ముచ్చింతల్లోని త్రిదండి చినజీయర్ ఆశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటుచేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ (సమతా మూర్తి విగ్రహం)ని ఆవిష్కరిస్తారు. ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్లో పటాన్చెరులోని ఇక్రిశాట్కు వెళ్తారు. 2.45 గంటలకు ఇక్రిశాట్ ఉత్సవాలను ప్రారంభింస్తారు. ఈ సందర్భంగా మొక్కల సంరక్షణ, వాతావరణ మార్పుల పరిశోధనల కోసం ఏర్పాటుచేసిన రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీ సెంటర్ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోతో పాటు స్మారక స్టాంపును ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మచ్చింతల్కు చేరుకొని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని జాతికి అంకితం చేస్తారు. సమానత్వ విగ్రహం చుట్టూ నెలకొల్పిన 108 దివ్యక్షేత్రాలను ప్రధాని సందర్శిస్తారు. ప్రధాని మోదీ ముచ్చింతల్లో మూడు గంటల పాటు గడపనున్నారు. రాత్రి 8.25 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం బీఆర్కేభవన్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్త్ను బ్లూబుక్ ప్రకారం ఏర్పాటుచేయాలని పోలీసుశాఖను ఆదేశించారు. వేదికల వద్ద వైద్య శిబిరాలతోపాటు, నిపుణులతోకూడిన వైద్య బృందాలను సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. వీవీఐపీల సందర్శన సమయంలో కొవిడ్-19 ప్రొటోకాల్ పాటించేలా చూడాలని, వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులతోపాటు లైటింగ్ ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. వీఐపీలు సందర్శించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను సమన్వయం చేయాలని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, హౌసింగ్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు అమోయ్కుమార్, హరీశ్ పాల్గొన్నారు.