PM Modi | వేములవాడ/వరంగల్, మే 8: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పీడించి ఆర్ఆర్ పన్నులను వసూలు చేస్తున్నదని, ఆ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్కు కప్పంగా కడుతున్నదని మండిపడ్డడారు. తెలంగాణను కాపాడాలంటే కాంగ్రెస్ను వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన వేములవాడలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వేములవాడతోపాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని తిమ్మాపూర్లో బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
‘తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమసారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చి న ఏ హామీనీ అమలు చేయలేదని అన్నారు. డిసెంబరు 9న పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసగించిందని ధ్వజమెత్తారు. సనాతన ధర్మాన్ని తిట్టేవాళ్లు రుణమాఫీ చేస్తామంటూ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని విమర్శించారు. అమరవీరులకు పెన్షన్, పేదలకు 250 గజాల ఇంటి జాగా, ప్రతి నెలా మహిళలకు రూ.2,500 హామీలకు దిక్కు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
దేశంలోని 13 కోట్ల మంది వినియోగదారులను మోసం చేసిన సహారా కంపెనీకి మోదీ సర్కారు వత్తాసు పలుకుతున్నదని సహారా బాధితులు ఆరోపించారు.బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారు మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2.80 కోట్ల మంది సహారా బాధితులు ఉన్నారని తెలిపారు. కుటుంబ అవసరాల కోసం సహారాలో దాచుకున్న డబ్బును కొల్లగొట్టిన కంపెనీ డైరెక్టర్లను మోదీ ప్రభుత్వం కాపాడుతున్నదని ఆరోపించారు. అరెస్ట్ అయిన డైరెక్టర్ రావిపాటి రామకోటేశ్వరరావు 24 గంటల్లో బయటకు రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎన్నికల సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. పార్టీ సింబల్ను కోటుకు ధరించి ఆలయంలోకి వెళ్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది.
– వేములవాడ