పెద్దపల్లి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : హిందూ ప్రజలు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. ఇప్పటికే తెలంగాణ మినహా పలు రాష్ర్టాల నుంచి నేరుగా కాశీకి వెళ్లడానికి రైళ్లు ఉన్నాయి. తాజాగా, ప్రధాని నరేద్రమోదీ తమిళ ప్రజల కోసం ఆదివారం బనారస్-కన్యాకుమారి మధ్య నడిచేలా ‘కాశీ తమిళ సంఘం’ అనే వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో తెలంగాణకేది ‘కాశీ తెలుగు సంఘం’ అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘కాశీ తమిళ సంఘం’ రైలుకు రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్నగర్, వరంగల్, ఖమ్మం రైల్వేస్టేషన్లలోనే హాల్టింగ్ సదుపాయం కల్పించారు. దీంతో మిగతా జిల్లాల ప్రజలు కూడా తమకు అందుబాటులో ఉన్న రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
తమిళులకు చేరువవుతున్న కాశీ ప్రయాణం తమకెందుకు దూరమని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలును పెద్దపల్లి జంక్షన్లోనూ ఆపితే ఇక్కడి ప్రజలు మధురై, తంజావూరు, తిరుచ్చి, కన్యాకుమారి, తిరునల్వేలి పుణ్యక్షేత్రాలతోపాటు ఉత్తరాన ప్రయాగ, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం పెద్దపల్లి జంక్షన్ నుంచి తమిళనాడులోని పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి నేరుగా రైలు సౌకర్యం లేదు. ‘కాశీ తమిళ సంఘం’ పెద్దపల్లి జంక్షన్ నుంచి వారణాసి జంక్షన్కు అత్యంత దగ్గరి రైల్వే మార్గమైన బల్లార్షా-నగ్బిర్-గొండియా బాలఘాట్-నైన్పూర్-జబల్పూర్ మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో వెళ్తే సుమారు 300 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం పెద్దపల్లి జంక్షన్ నుంచి వారణాసి, పాట్నాకు వెళ్లే రైళ్లు గ్రాండ్ ట్రంక్ మార్గమైన బల్లార్షా-సేవాగ్రామ్-నాగపూర్-ఇటార్సీ అటు నుంచి జబల్పూర్ మీదుగా చుట్టూ తిరుగుతూ అదనంగా 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి.