హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): బొంకరా బొంకరా మల్లిగా అంటే.. మా ఊరి మిరియాలు తాటికాయలంత అన్నాడట! ఈ సామెత బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘కరెంట్’ షాక్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గరినుంచి.. కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కేసింగ్ దాకా విలవిల్లాడిపోతున్నారు. విద్యుత్తు సంస్కరణల విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మొదలుపెట్టిన అబద్ధపు ప్రచారాన్ని.. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ అంతే మొండిగా కొనసాగించారు. సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపై సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అంశాలకు, నమస్తే తెలంగాణ ఫొటోలతో సహా ససాక్షికంగా ప్రచురించిన కథనానికి కేంద్రానికి మైండ్ బ్లాంక్ అయ్యింది. కేంద్రం ఇచ్చిన వివరణతో సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి అక్షరం నిజమని తేలిపోయింది. ముఖ్యమంత్రి ప్రశ్నలకు జవాబు ఏమివ్వాలో? తమను తాము ఎలా సమర్థించుకోవాలో తెలియక.. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ మంగళవారం నోటికొచ్చిన వివరణ ఇచ్చారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పనే లేదంట.. మరి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తున్నవి ఏమిటి? కేంద్రం పెట్టాలని చెప్పినవా? లేక.. అక్కడి సీఎం జగన్మోహన్రెడ్డే పెడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వాలతో తాము అధికారికంగా చేసిన సంప్రదింపులను సైతం అబద్ధాలని బొంకే తెంపరితనం బీజేపీ నేతలకు.. వారు నడిపే ప్రభుత్వానికే చెల్లింది. చట్టం చేయకుండా బిల్లు రూపంలో ఉన్నదాన్ని అమలుచేయగల సాహసం బీజేపీ సర్కారుకే చెల్లింది. కేంద్రం ఇచ్చిన వివరణలోని అసత్యాలు.. వాటి వెనుక ఉన్న వాస్తవాలు, కుట్రలు ఇవిగో..
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు
కేంద్రం వివరణ: వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్తు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలను ఎక్కడా బలవంతం చేయలేదు.
అసలు కుట్ర: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో వ్యవసాయ బావులకు మీటర్లు ఎవరు పెట్టినట్టు? ప్రకాశం జిల్లాలో మీటర్లు పెట్టేందుకు ఎవరు సిద్ధమవుతున్నట్టు? కేంద్రం ఆదేశించిందా? ఏపీ సీఎం జగన్ సొంతంగా పెడుతున్నారా? దీనిపై ఏపీ సీఎం కూడా జవాబు ఇవ్వాలి. కేంద్రం ఆదేశిస్తేనే మీటర్లు బిగిస్తున్నామని శ్రీకాకుళంలోని విద్యుత్తుశాఖ అధికారులు చెప్పటం వాస్తవం కాదా?
ఆర్డీఎస్ఎస్ గైడ్లైన్స్
బండి సంజయ్ ప్రచారం: వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అవసరంలేదని కేంద్రం ఆర్డీఎస్ఎస్ గైడ్లైన్స్లో స్పష్టంగా చెప్పింది.
అసలు వాస్తవం: ఆర్డీఎస్ఎస్ (రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) అనేది కేంద్రం అమలుచేస్తున్న ఒక కార్యక్రమం మాత్రమే. విద్యుత్తు సరఫరా మెరుగు, నష్టాలను తగ్గించే చర్యలు చేపట్టడం, ప్రతి విద్యుత్తు కనెక్షన్కు ప్రీపెయిడ్, స్మార్ట్ మీటర్లను అమర్చడం దీని ఉద్దేశం. దీనికీ, కేంద్రం రూపొందించిన విద్యుత్తు బిల్లుకూ సంబంధంలేదు. ఆర్డీఎస్ఎస్ గైడ్లైన్స్లో ఎక్కడా విద్యుత్తు బిల్లు ప్రస్తావన లేదు. అంతేకాదు.. ఆర్డీఎస్ఎస్ను దశలవారీగా అమలుచేస్తారు. ప్రస్తుతం మొదటి దశ అమలవుతున్నది. ‘వ్యవసాయ కనెక్షన్లు దూరం దూరంగా ఉండటం, కుసుమ్ ప్రాజెక్టు అమలు నేపథ్యంలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాల్సిన అవసరంలేదు’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోని ఏ దశలోనూ బాయికాడ మీటర్లు పెట్టబోము అని స్పష్టంగా చెప్పలేదు. పైగా కుసుమ్ ప్రాజెక్టు కూడా ఒక పెద్ద కుట్రే. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి వ్యవసాయ కనెక్షన్ దగ్గర సోలార్ పంపుసెట్లు పెడ్తారు. ఒకవేళ సౌర విద్యుత్తు అవసరానికి మించి ఉత్పత్తి అయితే గ్రిడ్కు అమ్ముకోవచ్చు. ఇందుకోసం కచ్చితంగా ఒక నెట్మీటర్ బిగిస్తారు. రైతు ఎంత విద్యుత్తు వాడుకున్నాడు? ఎంత మొత్తం గ్రిడ్కు అమ్మాడు? వంటివి నమోదు చేస్తారు. అంటే ప్రతి యూనిట్ను లెక్కిస్తారు. ఒకవేళ ఉత్పత్తి చేసినదాని కన్నా ఎక్కువ వాడుకొన్నా.. ఏ కారణం వల్ల అయినా సౌర విద్యుత్తు తక్కువ ఉత్పత్తి అయినా.. రైతు ముక్కుపిండి బిల్లు వసూలు చేస్తారు.
నిర్ణయం వెనక్కి తీసుకొన్నాం
బండి సంజయ్ ప్రచారం: బాయికాడ మీటర్లు బిగించాలన్న నిర్ణయం యూపీఏ హయాంలో చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం 2020 ఏప్రిల్లో సవరణ చేసింది. 2021 ఫిబ్రవరిలో మరికొన్ని మార్పులుచేసింది. ఫైనల్ డ్రాఫ్ట్ను ఈ ఏడాది జనవరి 3న అన్ని రాష్ర్టాలకు పంపింది. ఇందులో ఎక్కడా మీటర్లు కచ్చితంగా పెట్టాలని లేదు.
అసలు వాస్తవం: విద్యుత్తు సంస్కరణలు అమలుచేసే రాష్ర్టాలకే ఎఫ్ఆర్బీఎం పరిమితికి అదనంగా 0.5 శాతం రుణాలు ఇస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. ఈ సంస్కరణల ప్రకారం కచ్చితంగా విద్యుత్తు ఆడిటింగ్ జరగాలి. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తేనే రైతులు ఎంత వాడుకొన్నారో తెలుస్తుంది. ఆడిటింగ్ సాధ్యం అవుతుంది. ఒకవేళ బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు చెప్పినట్టు 2021 ఫిబ్రవరిలో కేంద్రం బాయికాడ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా, ఈ ఏడాది జనవరిలోనే ఫైనల్ డ్రాఫ్ట్ను రాష్ర్టాలకు పంపినా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు నిబంధనలను ఎలా ప్రతిపాదించారు? అదనపు రుణాలుగా తీసుకున్న 0.5 శాతం నిధులను కచ్చితంగా విద్యుత్తురంగంపైనే ఖర్చు చేయాలని చెప్తూ.. మళ్ళీ వాటికి నిబంధనలు ఎందుకు విధించారు? ఇవికూడా మోటర్లకు మీటర్లు పెట్టడం అన్న దగ్గరికే వచ్చి ఆగుతున్నదని స్పష్టం.
రెన్యువబుల్ ఎనర్జీ కొనుగోలుపై ఒత్తిడి
కేంద్రం వివరణ: రెన్యువబుల్ ఎనర్జీని (పునరుత్పాదక విద్యుత్తు) ప్రత్యేకించి ఒక సంస్థ దగ్గరే కొనాలని కేంద్రం బలవంతం చేయడం లేదు. రాష్ర్టాలు ఓపెన్ బిడ్డింగ్ ద్వారా తనకు నచ్చిన సంస్థ నుంచి, తక్కువ ధరకు ఇచ్చే సంస్థ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయవచ్చు.
అసలు కుట్ర: ఒక రాష్ట్రం వినియోగించే విద్యుత్తులో ఎంత శాతం రెన్యువబుల్ ఎనర్జీ ఉండాలనే నిబంధన ప్రస్తుతానికి లేదు. కేంద్రం భవిష్యత్తులో ఇంత శాతం ఉండాల్సిందే అంటూ కొ లతలు నిర్దేశిస్తే, దాన్ని అందుకోవడానికి రాష్ర్టా లు కచ్చితంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలి. ఆ మేరకు విద్యుత్తు వాడినా, వాడకున్నా చార్జీలు చెల్లించాలి. ఇది రాష్ర్టాలకు అదనపు భారమౌతుంది. ప్రైవేట్ విద్యుత్తును వాడుకొనేందుకు ప్రయత్నిస్తే రాష్ట్రంలోని హైడ్రో, థర్మల్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని బలవంతంగా తగ్గించాల్సి వస్తుంది. తద్వారా నష్టాలు భరించక తప్పదు. వీటికి బండి సంజయ్ జవాబిస్తారా? కేంద్ర మంత్రి వివరణ ఇస్తారా?
మీటర్ల ఏర్పాటు గుదిబండ
వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు చేయడం రైతులకు భారంగా మారింది. ఒక్కోసారి విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తుంది. పండిన పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. దీనికితోడు ప్రతి నెల విద్యుత్ బిల్లులు కట్టడం కష్టమవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో రైతులను పూర్తిగా మరిచిపోయారు.
– దన్నాన సత్యం, రణస్థలం , శ్రీకాకుళం జిల్లా