Congress | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్థానిక రాజకీయాలకు తెరలేపింది. ఇప్పటికే మూడేండ్లు పూర్తిచేసుకున్న మున్సిపాలిటీల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు అవిశ్వాసాలకు పురిగొల్పుతున్నది. ఫలితంగా ఇప్పటికే 12 మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు మొదలయ్యాయి. మరికొన్ని అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. అవిశ్వాసం పేరుతో రాజకీయ గందరగోళానికి తెరతీసిన అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నది. వారిని భయాందోళనకు గురిచేస్తూ అధికార మార్పిడికి ఏర్పాట్లు చేస్తున్నది. పార్టీ మారితే అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నది.
కాంగ్రెస్ హామీలు, బెదిరింపులకు కొందరు తప్పక తలొగ్గి పార్టీ మారుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో ఇప్పటికే అవిశ్వాసాలు జరుగుతున్నాయి. ఆర్మూర్, నర్సాపూర్లో ఇప్పటికే అవిశ్వాసాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లోపు అవిశ్వాసాలను పూర్తిచేసి మెజారిటీ తమవైపు ఉందన్న అపోహ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నది. తద్వారా లోక్సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నా రు. మభ్యపెట్టడం, లేదంటే ప్రలోభం, అదీ పనిచేయకుంటే బెదిరించడం ద్వారా కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుంటున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న ఈ పనితో ఇప్పటివరకు కలిసిమెలిసి సాగిన మున్సిపాలిటీల్లో రాజకీయ మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయి. ఈ గందరగోళంతో ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు అటకెక్కుతున్నాయి.
అవిశ్వాసాలు ప్రవేశపెట్టిన మున్సిపాలిటీలు ఇవే