హనుమకొండ, మే 22: ‘టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ… తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్.. ఉద్యమానికి కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ఇద్దరు బండికి జోడెండ్ల లాంటి వారు. వీరిని ఎవరూ విడదీయలేరు’ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతూ జోకర్లా మారాడన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గురించి టీపీసీసీ అధ్యక్షుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా చిల్లర మాటలు మానుకోవాలని ఆయన రేవంత్కు హితవు పలికారు. తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హకు కాంగ్రెస్కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీల ప్రత్యామ్నాయం కోసమే అనేక రాష్ట్రాలు కేసీఆర్ను కోరుకుంటున్నాయన్నారు.
రేవంత్ హద్దులో ఉండు: ఎమ్మెల్యే చల్లా
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రౌడీ, బ్లాక్ మెయిలర్గా వ్యవహరిస్తున్నాడని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి విమర్శించారు. రచ్చబండ పేరుతో ప్రొఫెసర్ జయశంకర్సార్ స్వగ్రామం అక్కంపేటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిక్లరేషన్ను ఆరేండ్ల క్రితమే సీఎం కేసీఆర్ చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆపద్బంధు పథకం పేరుతో కాంగ్రెస్ పాలనలో రైతులను ఇబ్బందులు పెట్టారన్నారు.