న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు కేంద్ర హోం శాఖ వివిధ పోలీసులు పతకాలను (Police Medals) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ పతకాలు అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 753 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది.
వీరిలో తెలంగాణ నుంచి 20 మందికి పతకాలు దక్కాయి. అందులో రాష్ట్రానికి 6 గ్యాలెంటరీ, 12 ఉత్తమ ప్రతిభ, 2 రాష్ట్రపతి అవార్డులు ఉన్నాయి. సీనియర్ పోలీసు అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్ (DS Chauhan), అదనపు డీజీ సౌమ్య మిశ్రాకు (Soumya Mishra) రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక ఏఆర్ ఎస్సై, 12 మంది అధికారులు విశిష్ట సేవ పతకాలు లభించాయి. వీరితోపాటు ఇద్దరు జైళ్ల శాఖ అధికారులు ప్రెసిడెంట్ మెడల్స్ అందుకోనున్నారు. ఇక ఉత్తమ ప్రతిభ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు 9 అవార్డులు దక్కాయి.