వరంగల్, జూలై 2(నమస్తే తెలంగాణ, వరంగల్ ప్రతినిధి): ప్రధాని మోదీ తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించాకే రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని బీఆర్ఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వరంగల్కు రావడం లేదని, బీజేపీలో నెలకొన్న గ్రూపు పంచాయితీలను పరిష్కరించేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని సభతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు.
కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ప్రజల 40 ఏండ్ల కోరిక అన్నారు. కాజీపేటలో నెలకొల్పాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు తరలించారని విమర్శించారు. తొమ్మిదేండ్లలో పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూ. 3,67,797 కోట్లు ఇస్తే.. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.1,68,000 కోట్లు మాత్రమేనని చెప్పారు. విభజన చట్టంలోని ప్రధానమైన హామీలను నెరవేర్చకుండా మోదీ ప్రభు త్వం విస్మరించిందని దుయ్యబట్టారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదన్న మోదీ.. మహారాష్ట్ర, గుజరాత్లలో ఎందుకు ఏర్పాటు చేశారని వారు దాస్యం, అరూరి ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే.. 150 ఎకరాల స్థలం అప్పగించిన విషయాన్ని వారు గుర్తుచేశారు.