హైదరాబాద్, జులై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు రెండు రోజులుగా భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, హన్మకొండ జిల్లాల్లో వరద, ముంపు ప్రాంతాల్లో పర్యటించి నేరుగా సోమవారం మధ్యాహ్నం 1.30కి అసెంబ్లీకి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 119 ఎమ్మెల్యేలతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఎమ్మెల్యే మొత్తం 120 మంది సభ్యులకు గాను 118 మంది (98.33శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే. తారక రామారావు తొలి ఓటు వేశారు.
కాగా, ఇద్దరు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోయారు. విదేశాల్లో ఒకరు, అనారోగ్య (కోవిడ్, డెంగ్యూ) కారణాలతో మరొకరు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు (ఎమ్మెల్యేలు), ఎన్నికల విధుల్లో ఉన్నవారిని, ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన వారిని మినహా ఏ ఒక్కరినీ పోలింగ్ గడువు వరకు అనుమతించలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా పాటించారు. అసెంబ్లీ కమిటీ హాల్లోకి వెళ్లే ప్రతీ ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతించారు. ఓటు వేసేందుకు వచ్చిన సభ్యులు భౌతిక దూరాన్ని పాటించాలని, విధిగా మాస్క్లు ధరించాలని సూచించారు. మొత్తంగా 15వ రాష్ట్రపతికి జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాగా, వీటి ఫలితాలు ఈనెల 21న వెల్లడి కానున్నది.
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు
సోమవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన కార్యాచరణపై వివరించారు. పార్టీ అధినేత, ముఖ్యంత్రి కేసీఆర్ నిర్ణయించిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే బ్యాలెట్ పేపర్లో ఉన్న ఇద్దరు అభ్యర్థుల పేర్లు, ఆ పేర్లకు ఎదురుగా ఉన్న గడీల్లో ఎన్నికల సంఘం ఇచ్చిన వాయిలెట్ (ఉదారంగు) రంగు ఇంకుపెన్నునే వినియోగించాలని వివరించారు. మంత్రులు..ఎమ్మెల్యేలు అక్కడే అల్పాహారం చేశారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు బస్సుల్లో అసెంబ్లీకి బయలుదేరారు.
తొలి ఓటు వేసిన కేటీఆర్
అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఉదయం 10.30కు మంత్రి కేటీఆర్ తొలి ఓటు వేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నేరుగా అసెంబ్లీకే సీఎం కేసీఆర్
భారీ వర్షాల కారణంగా శని, ఆదివారాలు భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, హన్మకొండ జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ సోమవారం హన్మకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు చేరుకుని నేరుగా అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు సీఎం కేసీఆర్తో కలిసి పోలింగ్ బూత్లోకి వెళ్లి లైన్లో నిలబడి ఓటేశారు.
118/120 = 98.33శాతం
రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు, ఏపీలోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్రెడ్డి మొత్తం 120 మంది సభ్యులకు గాను 118 (98.33శాతం) మంది ఓటేశారు. మంత్రి గంగుల కమలాకర్ అనారోగ్య కారణాలతో, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. రాష్ట్రం నుంచి 117 మంది సభ్యులు, ఏపీ నుంచి ఒకరు ఇలా మొత్తం 118 మంది ఓటింగ్లో పాల్గొన్నారు.
పార్లమెంట్ రూం నెంబర్ 63లో
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో టీఆర్ఎస్ రాజ్యసభ, లోక్సభ సభ్యులు సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలోని 63వ రూంలో ఏర్పాటు చేసిన పోలింగ్బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, కేఆర్ సురేష్రెడ్డి, జోగినపల్లి సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, బడుగుల లింగయ్యయాదవ్, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, లోక్సభ సభ్యులు నామా నాగేశ్వర్రావు, పోతుగంటి రాములు, గడ్డం రంజింత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్నేత, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్రెడ్డి, బీబీ పాటిల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆ ముగ్గురిదీ అరుదైన రికార్డు
రాష్ట్రం నుంచి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రికార్డు సృష్టించారు. నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మా సంస్థ వ్యవస్థాపకులు బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఈ ముగ్గురితో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం నుంచి వచ్చేనెల 12 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న ఈ ముగ్గురు సభ్యులు పార్లమెంట్ సమావేశాల తొలిరోజు రాజ్యసభలో అడుగుపెట్టారు. ఇదే రోజు 15వ రాష్ట్రపతి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవటం అనే అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.
నేడు ఢిల్లీకి బ్యాలట్ బాక్స్
పోలింగ్ గడువు ముగిసిన అనంతరం ఎన్నికల పరిశీలకుడు కృష్ణకుమార్ ద్వివేది, అసెంబ్లీ క్యాదర్శి వీ. నర్సింహాచార్యులు, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి, ఎన్నికల సంఘం నుంచి ఇద్దరు అసిస్టెంట్ పీవోలు బ్యాలట్బాక్స్ను సీజ్ చేసి అసెంబ్లీ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. స్ట్రాంగ్ రూంకు భద్రతా ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఈ బ్యాలట్ బాక్స్ను విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఏఆర్వో ఉపేందర్రెడ్డి నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రెటరీ జనరల్కు అప్పగించనున్నారు.