President Ramnath Kovind | ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను ముచ్చింతల్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముతామూర్తిని దర్శించుకున్నారు. భద్రవేదిలో 120 కిలోల రామానుజుల బంగారు విగ్రహాన్ని లోకార్పణం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని నెలకొల్పి చినజీయర్స్వామి చరిత్ర లిఖించారన్నారు. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు.
సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ జరిగిందన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. రామానుజులు సామాజిక అసమానతలు రూపుమాపారన్నారు. ప్రజల్లో భక్తి, సమానత కోసం కృషి చేశారని కొనియాడారు. దేశంలో పలు ప్రాంతాల్లో తన సందేశాలతో చైతన్యం నింపారన్నారు. రామానుజుచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారని, ఆయన బోధించిన సిద్ధాంతాలు జీవన ప్రమాణాల మెరుగుకు దోహదం చేశాయన్నారు. బడుగు వర్గాలకు దైవ దర్శనం ప్రాప్తి కోసం కృషి చేశారని చెప్పారు. ఈశ్వర ఆరాధన చేసేందుకు అన్ని వర్గాలకు హక్కు ఉంటుందని చెప్పారన్నారు.
దైవభక్తి ద్వారా ప్రజలకు ముక్తి లభిస్తుందని చాటి చెప్పారని, సాంస్కృతిక విలువల ఆధ ఆరంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారన్నారు. అంతకు ముందు చినజీయర్స్వామి మాట్లాడుతూ.. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. సమతా సిద్ధంతాలను రామానుజులు ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. అన్ని వర్గాలు సమానమే అని రామానుజులు చాటి చెప్పారని, భగవంతుడి ఆరాధనకు అన్ని వర్గాలు అర్హులేనని చెప్పారని, సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.