భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 7 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్కుమార్ గురువారం యాదాద్రి అదనపు కలెక్టర్ భాసరరావుతో కలిసి పోచంపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 18న హైదరాబాద్ వస్తున్నారని, ఇందులో భాగంగా 20న ఉదయం 11:10 గంటలకు ఆమె భూదాన్ పోచంపల్లికి రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. సంత్ కబీర్, పద్మశ్రీ జాతీయ అవార్డులు పొందిన వారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మంది ఉన్నారని, అందులో ఐదు నుంచి పది మందిని ఎంపిక చేసి రాష్ట్రపతితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఔనత్యాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన ఉంటుందని చెప్పారు. తెలంగాణ చేనేత వస్త్రాలు గొల్లభామ, పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల వస్ర్తాలు, పుట్టపాక తెలియా రుమాలును ప్రదర్శనకు ఉంచనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాలుగు మగ్గాలపై తెలియా రుమాలు, పోచంపల్లి ట్రెడిషనల్, డబుల్ ఇకత్, పోచంపల్లి లేటెస్ట్ వస్త్రాలను నేసేలా ఏర్పాటు చేస్తారని చెప్పారు.