హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆమె పర్యటన ఖరారైంది. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి నిలయం ఆమె పర్యటనను ఖరారు చేసింది. రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్.. పోలీస్, ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులతో త్వరలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, కరోనా ప్రభావంతో గత రెండేండ్లుగా రాష్ట్రపతి శీతాకాల విడిది రద్దు అయ్యింది.
రాష్ట్రపతి షెడ్యూల్ ఇదీ..
ఈ నెల 28న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రాక, 29న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులు, అతిథులతో భేటీ, 30న సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం.
నేడు తిరుమలకు ద్రౌపది ముర్ము
రెండు రోజుల తిరుమల పర్యటన నిమి త్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం తిరుమల రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా స్వల్పంగా ట్రా ఫిక్ ఆంక్షలను విధించి, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.