యాదాద్రి భువనగిరి : చేనేత పరిశ్రమ( Handloom cloths)తో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని, తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తున్నదని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ప్రశంసించారు. రాష్ట్రపతి భూదాన్ పోచంపల్లి(Boodan Pochampally)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావడం అభినందనీయమన్నారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది..భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని పేర్కొన్నారు.
యూఎన్ఏ భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతు దొరుకుతుందని, చేనేత వస్త్రాల కళను వారసత్వంగా మరొకరికి అందించడం ప్రశంసనీయమన్నారు.చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలని, మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానని రాష్ట్రపతి పేర్కొన్నారు.
కాగా, శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పోచంపల్లికి వెళ్లారు. ముందుగా పట్టణంలోని టూరిజం సెంటర్, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్లిన రాష్ట్రపతి.. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం వినోబాబావే భవనంలో ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరెలను తయారీని పరిశీలించారు. అంతకు ముందు అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.