యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో నేసిన చీరలు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. పోచంపల్లి, వరంగల్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నదని, వీటికి జీఐ ట్యాగ్ రావడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రపతి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన చేనేత కార్మికుల సమావేశానికి హాజరయ్యారు. తొలుత పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్స్ను సందర్శించారు.. అనంతరం తెలంగాణ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్ను సందర్శించి నూలు నుంచి వస్త్ర ఉత్పత్తి పరిణామ క్రమాన్ని తెలియజేసే చేనేత స్టాళ్లను పరిశీలించారు. అకడ వినోబా బావే ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
అనంతరం సభలో ఆమె మాట్లాడారు. చేనేత రంగంలో జరుగుతున్న కృషి గొప్పదని, చేనేత కళను వారసత్వంగా మరొకరికి అందించడం అభినందనీయమని అన్నారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూటీవో) ప్రపంచ పర్యాటక రంగంలో 2021లో పోచంపల్లి ప్రాంతాన్ని పర్యాటక గ్రామంగా ప్రకటించడాన్ని రాష్ట్రపతి స్వాగతించారు. తన ప్రాంతం నుంచి కొంత మందిని ఇకడికి తీసుకొచ్చి చేనేత రంగం పనితీరును పరిశీలిస్తామని తెలిపారు. భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్టీ వెంకటగిరి తరహాలో ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకున్నది. ఆమె ప్రయాణిస్తున్న ఆర్మీ హెలిక్యాప్టర్ భూదాన్ పోచంపల్లిలో ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడున్న పోలీసులు గాలికి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఉప్పల్ ఏసీపీ శ్రీనివాస్కు చేయి విరిగింది. ఆయన్ను చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్కు తరలించారు. ఆయనతోపాటు అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా రాచకొండ డీసీపీ రాజేశ్చంద్ర స్పందిస్తూ.. ఇది అపశ్రుతి కాదని, ఉప్పల్ ఏసీపీ శ్రీనివాస్ స్వల్ప అస్వస్థత కారణంగా కండ్లు తిరిగి కింద పడిపోయారని తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): విశిష్టమైన సాంస్కృతిక వారసత్వ మూలాలు, పుష్కలమైన విద్యా, ఉద్యోగ వనరులు కలిగిన రాష్ట్రంగా సిరిసంపదలతో సుభిక్షంగా ఉన్న ఈ తెలంగాణ నిజమైన కోటి రతనాల వీణ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆమె మాట్లాడారు. ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్, నిష్ణాతులైన ఐటీ మానవ వనరులతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇక్కడి ఐటీ నిపుణులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్నదని అన్నారు.