న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా సోదరభావంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కులం, మతం, ప్రాంతం, భాషా గుర్తింపు కంటే భారతీయ పౌరుడనే గుర్తింపే అత్యున్నతమైనదని చెప్పారు. దేశ ప్రజలంతా సమానమేనని, అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన విధులు వర్తిస్తాయని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఆర్థిక సాధికారతతోనే..
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ‘మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తూ దేశానికి సేవ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మహిళలు ఆయా రంగాల్లో ప్రత్యేక ముద్రను వేస్తున్నారు. మహిళల ఆర్థిక సాధికారత వల్ల కుటుంబంతో పాటు సమాజంలో వారి స్థానం మరింత పటిష్ఠం అవుతుంది. సరోజిని నాయుడు, అమ్ము స్వామినాథన్, రమా దేవి, అరుణ అసఫ్ అలీ, సుచేతా కృపలానీ తదితరులను ఆదర్శంగా తీసుకొని దేశంలోని ఆడబిడ్డలు ముందుకుసాగాలి. సత్యాగ్రహ మార్గంలో అడుగడుగునా జాతిపిత మహాత్మాగాంధీకి కస్తూర్బా గాంధీ సరితూగారు’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
‘విదేశీ పాలకుల నుంచి మనం స్వాతంత్య్రంతో పాటు విధి రాతను తిరిగి రాసే స్వేచ్ఛను పొందాం. ప్రపంచ వేదికపై భారత్ తిరిగి సముచిత స్థానాన్ని పొందింది. గ్లోబల్ వార్మింగ్పై దృష్టి సారించాలి. దురాశ కారణంగానే ప్రపంచం ప్రకృతికి దూరమైంది’ అని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.