బీర్కూర్(కామారెడ్డి ) : కామారెడ్డి జిల్లా(Kamareddy) బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులో నిర్మించిన తెలంగాణ తిరుమల దేవస్థానానికి కేటాయించిన 66 ఎకరాల ప్రభుత్వ రెవెన్యూ భూమి(Government land) పత్రాలను రెవెన్యూ అధికారులు(Revenue officers) దేవాదాయ శాఖ(Endowment)కు అప్పగించారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, స్పీకర్ పోచారం(Speaker Pocharam) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)కు పాలకమండలి సభ్యులు, భక్తుల తరుపున ధన్యవాదాలు తెలిపారు. 2016 ఏప్రిల్ 2 సీఎం కేసీఆర్ తెలంగాణ తిరుమల దేవాలయాన్ని సందర్శించారని గుర్తు చేశారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు దేవాలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని కెటాయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం సూచనలకు అనుగుణంగా రెవెన్యూశాఖ నుంచి భూమిని అధికారికంగా శనివారం ఆలయంలో దేవాదాయశాఖకు అప్పగించిందని పేర్కొన్నారు.ఈ భూమిలో దేవాలయం తరుపున భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన నిర్మాణాలు చేపడుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, రెవెన్యూశాఖ, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.