హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేశ్ వ్యాస్ నేతృత్వంలోని ముగ్గురు అధికారుల బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా నితేష్ వ్యాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ని ఆదేశించారు. ఓటర్ల జాబితాపై సమీక్షించిన ఆయన.. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. జూన్ 1 నుంచి రాష్ట్రస్థాయి అధికారులు ఈవీఎం పనితీరును పరిశీలించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసమైన రిటర్నింగ్ ఆఫీసర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారులకు ఈసీఐ నిర్వహించే రెండు రోజుల వర్క్షాప్ కోసం షెడ్యూల్ సిద్ధం చేయాలని కోరారు. సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఈవీఎంలను ఈసీఐఎల్ సరఫరా చేస్తుందని, వీటిని పరిశీలించాకే జిల్లాలకు పంపిస్తామని తెలిపారు. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్, సంజయ్కుమార్, జాయింట్ సీఈవో రవికిరణ్, డిప్యూటీ సీఈవో సత్యవాణి పాల్గొన్నారు.