న్యూఢిల్లీ, మార్చి 11: గర్భిణులు నిద్రపోయేందుకు మూడు గంటల ముందే లైట్లు ఆర్పేయడం లేదా డిమ్ చేయడం ద్వారా మధుమేహం బారిన పడే ముప్పు తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లకు కూడా నిద్రకు మూడు గంటల ముందు నుంచే దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు 741 మంది గర్భిణులపై అధ్యయనం జరిపారు. గర్భధారణ మధుమేహం అనేది తల్లికి ప్రసూతి సంబంధ సమస్యలు పెంచుతుందని, మధుమేహం, చిత్తవైకల్యం, గుండెజబ్బుల ముప్పుకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శిశువులోనూ దీని వలన పెరిగేకొద్దీ స్థూలకాయం, రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ‘గర్భిణులు నిద్రపోవడానికి మూడు గంటల ముందే లైట్లు తగ్గించడం, కంప్యూటర్లు, ఫోన్లు వాడకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వాడాల్సి వస్తే వాటి స్క్రీన్లను అవకాశం ఉన్నంతవరకు డిమ్ చేసుకోవడం మంచిది. గదిలో కూడా నైట్ లైట్లను వేసుకోవాలి.’ అని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మింజీ కిమ్ సూచించారు.