నారాయణపేట, ఏప్రిల్ 17 : ప్రసవం కోసం దవాఖానకు వచ్చిన గర్భిణి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. మద్దూరు మండలం భీంపురానికి చెందిన గర్భిణీ గోవిందమ్మ (36) ప్రసవం కోసం మద్దూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మొదటి రెండు కాన్పులు సాధారణం కావడంతో మూడో కాన్పు కూడా నార్మల్ అవుతుందని కుటుంబ సభ్యులు భావించారు.
కానీ అక్కడి వైద్యులు కష్టంగా ఉంది వేరే దవాఖానకు వెళ్లాలని సూచించారు. దీంతో బుధవారం నారాయణపేట జిల్లా దవాఖానకు తీసుకొచ్చారు. ప్రసవం చేసే క్రమంలో ఆమె మరణించింది. గుండెపోటు రావడంతోనే గోవిందమ్మ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే గోవిందమ్మ చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట బైఠాయించారు. గ్రామ పెద్దలు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.