హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీలకు త్వరలో పూర్వ ప్రాథమిక టీచర్ స్థాయి వస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్హౌస్లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (బీఆర్టీయూ) రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ ఏండ్లు గా పనిచేస్తున్న అంగన్వాడీలకు నేడు సరైన గౌరవం దక్కిందని పేర్కొన్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఫైనాన్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినోద్కుమార్కు అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా అంగన్వాడీ టీచర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు సులోచన నేతృత్వంలో 40 మంది వినోద్కుమార్ సమక్షంలో బీఆర్టీయూలో చేరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు రాంబాబుయాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలాసకవి నిర్మల, కోశాధికారి ఎం వేదవతి, ఉపాధ్యక్షులు ఎం రమాదేవి, ఎం అరుణ, సహాయ కార్యదర్శి విమలాదేవి, జకుల మంగమ్మ, రమాతార, నసీమ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.