బేగంపేట్ ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించినట్టు గాంధీ దవాఖాన టీజీజీడీఏ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రాజేశ్వర్రావు తెలిపారు. మంగళవారం టీజీజీడీఏ నాయకులు మంత్రి హరీశ్రావును ఆయన ఇంట్లో కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వ వైద్యులకు సంబంధించిన 56 నెలల పీఆర్సీ, ఎరియర్స్ను ఒకేసారి కాకుండా విడుతల వారీగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, దీనిపై త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపినట్టు వారు పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ వైద్యులు కోరినట్టుగానే 15 రోజులు ఈఎల్ ఎన్క్యాష్మెంట్, ట్రావెలింగ్ అలవెన్స్లపై పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా మంత్రి ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని, డీఎంఈ రమేశ్రెడ్డిని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావుకు, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి, డీఎంఈ రమేశ్రెడ్డికి టీజీజీడీఏ నేత పల్లం ప్రవీణ్, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్వర్రావు కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా వీటికి సంబంధించిన జీవోలను విడుదల చేయాలని కోరారు.
ఆరోగ్య తెలంగాణ సాధనలో తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఉస్మానియా హాస్పిటల్ టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ రంగా, కార్యదర్శి శంకర్సింగ్, గాంధీ టీజీజీడీఏ ప్రధాన కార్యదర్శి భూపిందర్ రాథోడ్, సభ్యులు రవి, బన్సీలాల్, కృష్ణనాయక్, వినోద్, సంజీవ, శంకర్నాయక్ తదితరులు ఉన్నారు.