PRC | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీ ఫిట్మెంట్ డిమాండ్ సుఖాంతమైంది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లు, పింఛనుదారులకు 7% ఫిట్మెంట్ ఇచ్చేందుకు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. ఇతర డిమాండ్ల విషయంలోనూ సానుకూలంగా స్పందించాయి. శనివారం హైదరాబాద్లోని విద్యుత్తుసౌధలో విద్యుత్తు సంస్థల యాజమాన్యాలకు, విద్యుత్తు ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీకి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీనితో ఈ నెల 17 నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు విద్యుత్తు సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. తాజా ఒప్పందంతో విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 70 వేల మంది ప్రయోజనం పొందనున్నారు.
2022 ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీ విషయంలో విద్యుత్తు సంస్థల యాజమాన్యాలతో ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. పే రివిజన్ కమిటీ 5% ఫిట్మెంట్కు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లకు సంబంధించిన ఇతర డిమాండ్లపై కూడా జేఏసీతో ఫిబ్రవరి 1, మార్చి 6,10,13,29 తేదీల్లో యాజమాన్యాలు చర్చించాయి. అవి కొలిక్కి రాకపోవడంతో ఈ నెల 9న విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విద్యుత్తు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 7% ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రతిపాదించారు.
ఈ నేపథ్యంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు నేతృత్వంలో విద్యుత్తుసౌధలో జరిగిన చర్చల్లో విద్యుత్తు సంస్థల తరపున ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు, జేఎండీ శ్రీనివాసరావు, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (హెచ్ఆర్) వెంకటేశ్వర్రావు, ఎస్సీడీసీఎల్ డైరెక్టర్ (హెచ్ఆర్) జీ పర్వతం, జెన్కో డైరెక్టర్ (హెచ్ఆర్) ఎస్ అశోక్, ట్రాన్స్ కో ఎఫ్ఏ సీసీఏ జీ శ్రీనివాస్ పాల్గొనగా విద్యుత్తు సంఘాల తరపున ప్రతినిధులుగా జీ సాయిబాబు, జీ వరప్రసాద్, ఎస్ ప్రభాకర్, ఈ శ్రీధర్, కేవీ జాన్సన్, కే ప్రభాకర్, ఎంఏ వజీర్, డీ రాధాకృష్ణ పాల్గొని ఒప్పందంపై సంతకాలు చేశారు. సాక్షులుగా టీఈఈ జాక్ తరఫున ఎన్ శివాజీ, టీఎస్పీఈఏ జాక్ తరఫున పీ రత్నాకర్రావు సంతకాలు పెట్టారు.
యాజమాన్యాలతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో విద్యుత్తు సంఘాల నాయకులు శివా జీ, ప్రకాశ్, అంజయ్య, రత్నాకర్రావు, సాయిబాబు, బీసీరెడ్డి విద్యుత్తుసౌధలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి జగదీశ్రెడ్డికి, సీఎండీ ప్రభాకర్రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యుత్తు సంస్థ ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మరోసారి జాక్ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. 24 గంటల నిరంతరాయ విద్యుత్తు సరఫరా విజయవంతానికి పునరంకితం అవుతామని చెప్పారు.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు