Pravalika | హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జిల్లా బికాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బుధవారం ప్రవళిక కుటుంబసభ్యులు కేటీఆర్ను కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, తన కూతురు మరణానికి కారణమైన శివారామ్ను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని ఓదార్చి భరోసా ఇచ్చారు. ప్రవళిక మరణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని, ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రవళిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. కేసు పురోగతిపై డీజీపీతో మాట్లాడి విచారణ వేగవంతం చేయాలని సూచించారు. తన కూతురు మరణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి తమ కడుపుకోతను చల్లారుస్తామని కేటీఆర్ భరోసా కల్పించారని ప్రవళిక కుటుంబసభ్యులు పేర్కొన్నారు.