హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): మహిళలను లైంగికంగా వేధించిన కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నదని, అందుకే ఆయన సులువుగా దేశం నుంచి పారిపోగలిగాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులపై ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్కు కేటీఆర్ సోమవారం స్పందించారు. మహిళల పట్ల మోదీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ‘మహిళలపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న వార్తలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆయన దేశం విడిచి ఎలా పారిపోగలిగాడు? ప్రజ్వల్ రేవణ్ణ తప్పించుకోవటంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నది. ఒకవేళ కేంద్ర సహకారం లేనట్టయితే ఆయనను దేశానికి తిరిగి తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షించాలి. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న వేధింపులను మోదీ సర్కారు పట్టించుకోవటం లేదు. బిలిస్ బానో రేపిస్టులను విడుదల చేశారు. బ్రిజ్భూషణ్ సింగ్పై మహిళా రెజర్లు చేసిన ఆరోపణలను పట్టించుకోలేదు. ఇప్పుడు మరో సంఘటన. మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.