ఆరు గ్యారెంటీల అమలుకు వందరోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం.. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. పదేండ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమరాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. గృహలక్ష్మి లబ్ధిదారులు వరంగల్ జిల్లాలో నిరసనకు దిగగా, దళితబంధు అర్హులు కరీంనగర్, నల్లగొండల్లో ఆందోళన చేపట్టారు. గొర్రెల పంపిణీ ఏమైందంటూ నల్లగొండలో ప్రదర్శన జరుగగా.. మిర్చికి మద్దతు ధర కోరుతూ ఓరుగల్లు రైతులు రాస్తారోకో చేశారు. మరోవైపు ఆరు గ్యారెంటీలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణను ప్రైవేటుకు కట్టబెట్టింది!
Prajapalana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 8 (నమస్తే తెలంగాణ)/బాలానగర్: కాంగ్రెస్ సర్కారు అత్యంత ఆర్బాటంగా స్వీకరించిన ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులు రోడ్డుపై గాల్లో ఎగురుతూ దర్శనమిచ్చాయి. హైదరాబాద్లోని హయత్నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు బాలానగర్ ఫ్లైఓవర్పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్పల్లిలోని ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు.
హైదరాబాదులో రోడ్లపాలైన ప్రజాపాలన అప్లికేషన్లు
ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పిన అధికారి తీరుపై కన్నెర్రజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీల కోసం కోట్లాది మంది నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో ఉండి దరఖాస్తులు సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
ఈ దరఖాస్తుల్లోని వివరాలన్నింటినీ ఈ నెల 17వ తేదీలోపు కంప్యూటరీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా గ్రేటర్ పరిధిలోనూ అధికారులు ఆ ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం గ్రేటర్వ్యాప్తంగా 3,500 మంది ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని, ఎక్కడికక్కడ జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కంప్యూటరీకరిస్తున్నట్టుజీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రకటించారు.
అసలేం జరిగింది?
బాలానగర్ ఫ్లైఓవర్పై ఓ యువకుడు స్కూటీ (ఏపీ 39 హెచ్హెచ్ 6455)పై అట్టపెట్టెలో వేలాది దరఖాస్తులను కుక్కి తీసుకెళ్తున్నాడు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తాడు తెగడంతో అందులోని కాగితాలన్నీ రోడ్డుపై గాలికి కొట్టుకుపోయాయి. అతడి ముందు, వెనక ఉన్నవారు ఒక్కసారిగా వాహనాలు ఆపి, ఆ యువకుడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఓ యూట్యూబర్ కూడా ఆ కాగితాలను తెచ్చి ఇచ్చే క్రమంలో అవేంటని చూసి అవాక్కయ్యాడు.
ప్రజాపాలన కింద నిరుపేదలు దరఖాస్తు చేసుకున్న అభయహస్తం ఫారాలు అని గుర్తించాడు. వెంటనే స్కూటీపై ఉన్న యువకుడిని నిలదీశాడు. ఈలోగా ఇతర వాహనదారులు కూడా ఆ చుట్టుపక్కల కొట్టుకుపోయిన కాగితాలను తీసుకువచ్చి వాకబు చేశారు. ఇవన్నీ ప్రజాపాలన దరఖాస్తులని తెలుసుకొని ‘కోటి ఆశలతో పేదోళ్లు ఐప్లె చేస్తే ఎక్కడికి తీసుకుపోతున్నావ్’ అంటూ ప్రశ్నించారు. అవి హయత్నగర్ సర్కిల్ పరిధిలో నిరుపేదలు సమర్పించిన దరఖాస్తులని గుర్తించారు.
వాహనదారులు, యూట్యూబర్ నిలదీయడంతో తాను పాన్ డబ్బాలో పని చేస్తానని సదరు యవకుడు పేర్కొన్నాడు. మరి హయత్నగర్కు చెందిన దరఖాస్తులు ఎక్కడికి తీసుకుపోతున్నావని ప్రశ్నించగా… పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. ఒకసారి ఈసీఐఎల్కు చెందిన వ్యక్తినని, మరోసారి రామాయంపేటకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అందరూ గట్టిగా నిలదీయడంతో తనకేమీ తెలియదని, లోకేషన్ మ్యాప్ ద్వారా వీటిని తరలిస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశాడు.
ఇదీ అసలు కథ!
వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో జీహెచ్ఎంసీ శిక్షణ ఇచ్చిన ఆపరేటర్ల ద్వారా కంప్యూటరీకరించాల్సిన ప్రజాపాలన లబ్ధిదారుల వివరాలను ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కంప్యూటరీకరిస్తున్నారు. గతంలో కూకట్పల్లి జోనల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన రవీందర్కుమార్ కొంతకాలం కిందట ఎల్బీనగర్ జోన్కు బదిలీ అయ్యారు. హయత్నగర్ సర్కిల్ డీసీగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన పరిధిలోని దరఖాస్తు ఫారాలను జాగ్రత్తగా, తన కార్యాలయంలోనే కంప్యూటరీకరించాల్సింది పోయి.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వాటిని పెట్టి చేతులు దులుపుకోవాలని చూశారు. ఇందులో భాగంగా కూకట్పల్లి సంగీత్నగర్ దగ్గర ఒక ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు తెలిసింది. ఈ మేరకు కనీసం తానుగానీ, తన సిబ్బందితో గానీ ఆ ఫారాలను పంపకుండా.. ర్యాపిడో బుక్ చేసి మరీ తరలిస్తున్నట్టు తేలిం ది. కాగా, రోడ్డుపై పడ్డ కొన్ని దరఖాస్తులను వాహనదారులు ఏరి తీసుకొచ్చి ఇచ్చినా.. ఇంకా ఎన్ని దరఖాస్తులు గాలికి కొట్టుకుపోయాయో తెలియకపోవడం గమనార్హం.
బాలానగర్ రోడ్డుపై నా దరఖాస్తా?
బాలానగర్ ఫ్లైఓవర్పై గాలికి కొట్టుకుపోయిన దరఖాస్తుల్లోని ఒక ఫారంలోని వివరాలు పరిశీలించి.. అందులోని లబ్ధిదారుడికి ఫోన్ చేయగా శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల కోసం ఈ నెల 6న తన తల్లి రావుల సునీత పేరు మీద దరఖాస్తు చేసినట్టు చెప్పారు. హయత్నగర్ పరిధిలోని ఖాదీబోర్డు కాలనీలో నివాసం ఉంటున్న తాము హయత్నగర్లోనే ప్రజాపాలన పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో దరఖాస్తును అధికారులకు అందజేశామని తెలిపారు. ‘అక్కడ అధికారులకు స్వయంగా అందజేసిన దరఖాస్తు బాలానగర్లో ఎందుకు రోడ్డు మీద పడిపోతుంది?!’ అని ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మి పథకం కింద తన తల్లికి నెలకు రూ.2500 వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చాం
ఈ ఘటనపై ‘నమస్తే తెలంగాణ’ హయత్నగర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్కుమార్ను ఫోన్లో సంప్రదించగా… ప్రజాపాలన దరఖాస్తులను ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. అందులో భాగంగానే హయత్నగర్ సర్కిల్ పరిధిలో వచ్చిన దరఖాస్తు ఫారాలను కూకట్పల్లిలో ఒక ఏజెన్సీకి ఇచ్చి కంప్యూటరీకరిస్తున్నామని చెప్పారు. ఇదే విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
– హయత్నగర్ డీసీ రవీందర్కుమార్