వేములవాడ రూరల్, జనవరి 9: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్, క్షేత్రస్థాయి పరిశీలన, కమిటీల పేరిట డ్రామాలడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.
ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసినా పథకాల అమలులో చిత్తశుద్ధి చూపడంలేదని విమర్శించారు. రేషన్కార్డు ప్రాతిపదికగా గ్యారెంటీలను వర్తింపజేస్తే పేదలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటాంపల్లిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని మాట్లాడారు.