హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో కీలక మార్పు చోటుచేసుకోనున్నది. ఇప్పటివరకు సెకండియర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకే ప్రాక్టికల్స్ ఉండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. దీంతో థియరీ మార్కులు తగ్గనున్నాయి. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ఇంగ్లిష్లో ప్రాక్టికల్స్ అమలుపై నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2023-24) వార్షిక పరీక్షల్లో ఇంగ్లిష్కలో 80 మార్కులు థియరీ, 20 మార్కులు ప్రాక్టికల్స్కు కేటాయిస్తారు. వార్షిక పరీక్షలే కాకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్ను కూడా ఇదే విధానంలోనే నిర్వహించనున్నారు.
నూతన విధానం ప్రకారం ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టుకు ల్యాబ్ వర్క్ తప్పనిసరి కానున్నది. దీంతో అన్ని కాలేజీల్లో ఇంగ్లిష్ ల్యాబ్లు ఏర్పాటు కానున్నాయి. వీటిలో విద్యార్థులు ఇంగ్లిష్లో మాట్లాడటం, కంప్యూటర్ సహకారంతో ఆడియో రికార్డు చేయడం వంటివి నేర్పిస్తారు. థియరీ క్లాసులతోపాటు ల్యాబ్వర్క్ కోసం కాలేజీలు షెడ్యూల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీల్లో అమల్లో ఉన్నది.
విద్యార్థులు పరీక్షలు ఎలా నిర్వహిస్తే వాటికే అలవాటుపడుతున్నారు. ఇంతకాలం థియరీ పరీక్షలను మాత్రమే రాస్తున్నారు, పాసవుతున్నారు. అంతర్జాతీయ అవసరాల నేపథ్యంలో ఇంగ్లిష్లో ధారాళంగా మాట్లాడటం తప్పనిసరి కావడంతో మార్పులకు శ్రీకారం చుట్టాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుంది.
– నవీన్మిట్టల్, ఇంటర్బోర్డు కార్యదర్శి